KTR : తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. అధికార ,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గవర్నర్ ప్రసంగంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. కేంద్రం టార్గెట్గా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం, ముచ్చట్లు చెప్పడం అభివృద్ధి కాదు అని అన్నారు. రాష్ట్రాన్ని కించపరిచే విధంగా విమర్శలు చేయవద్దు కేంద్రానికి సూచించారు. నల్ల చట్టాలతో 700 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు? అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రధాని ఎక్కడా ఉండరని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఏకపక్షంగా తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం..
కేంద్ర విధానాలను తప్పుపడుతూ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. డిస్కంలను ఎందుకు ప్రైవేటీకరించాలి? ఎందుకు మోటార్లకు మీటర్లు పెట్టాలి? అని ప్రశ్నించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. తాము రైతు రాజ్యం కావాలంటే.. బీజేపీ కార్పొరేట్ రాజ్యం కావాలంటోందని కేటీఆర్ అన్నారు. గుజరాత్లో పైకి బిల్డప్ తప్ప లోపల ఏమీ ఉండదన్నారు. నాయకుడు నటించొద్దు.. లీనమై పనిచేయాలని కేటీఆర్ మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తెలంగాణ దేశానికే ఆదర్శం..
తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కేటీఆర్ అన్నారు. దేశానికే దారిచూపే టార్చ్ బేరర్గా తెలంగాణ మారిందన్నారు. దేశం కడుపునింపే స్థాయికి తెలంగాణ చేరిందని వివరించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా మాగాణి ఉందని తెలిపారు. 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగిందని వివరించారు. కరోనా సమయంలో 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపట్టామని చెప్పారు. రైతుబంధును అసాధారణమైన కార్యక్రమంగా పేర్కొన్నారు. 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయలు జమ చేశామని వివరించారు. ఐక్యరాజ్య సమితి కూడా రైతుబంధు పథకాన్ని ప్రశంసించిందని గుర్తు చేశారు. 94 వేల కుటుంబాలను రైతు బీమాతో ఆదుకున్నామన్నారు. పార్టీలు చూడకుండా.. రాజకీయాలు చేయకుండా సాయం అందిస్తున్నామని కేటీఆర్ సభలో తెలిపారు.