Kotamreddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ మరోసారి వైసీపీ పెద్దలపై ఘాటు విమర్శలు చేశారు. తాను వైసీపీ నుంచి సైలెంట్ గా వెళ్లాలనుకున్నానని తెలిపారు. అయితే 13 మంది మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పార్టీ ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు తన వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా మాట్లాడుతుంటే సహించలేకపోయానని స్పష్టం చేశారు. అందుకే తప్పని పరిస్థితుల్లో వారికి సమాధానం చెబుతున్నానన్నారు. ఈసారి నేరుగా ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ కోటంరెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు.
టార్గెట్ సజ్జల..
తనను, తన సోదరుడిని కొట్టుకుంటూ తీసుకెళ్తానని కడప నుంచి అనిల్ అనే వ్యక్తితో ఫోన్ చేయించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఇదంతా సజ్జల కోటరీ నుంచే జరుగుతోందని ఆరోపించారు. తనకు ఫోన్ కాల్స్ వస్తే.. నెల్లూరు రూరల్ నుంచి వీడియో కాల్స్ మీకొస్తాయంటూ సజ్జలను హెచ్చరించారు. సలహాదారుగా ప్రభుత్వ పనులను మాసేసి ఆపరేషన్ నెల్లూరు రూరల్ అనే విధంగా సజ్జల వ్యవహరిస్తున్నారని సెటైర్లు వేశారు. ఫోన్లు చేయించి భయపెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాను భయపడతానని అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుందని అన్నారు. తనపై కిడ్నాప్ కేసు పెట్టారని అవసరమైతే మర్డర్ కేసు కూడా పెట్టుకోవాలని సవాల్ చేశారు.
కాకాణికి కౌంటర్లు..
టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్లో కోటంరెడ్డి పడ్డారని మంత్రి కాకాణి చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. కోటంరెడ్డి వైసీపీకి వీర విధేయుడు కాదు.. వేరే వాళ్లకు విధేయుడన్న కాకాణి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. తాను ఎక్కడ ఉంటే అక్కడ విధేయుడిగా ఉంటానే తప్ప పక్కదారులు చూసే మనిషిని కాదని స్పష్టం చేశారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వద్దామనుకుంటే నమ్మక ద్రోహం? ఎలా అవుతుందని ప్రశ్నించారు.
కాకాణిని జడ్పీ ఛైర్మన్ చేసిన ఆనంకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నారు? అని కోటంరెడ్డి నిలదీశారు. ఓదార్పు యాత్ర సమయంలో పొదలకూరులో వైఎస్ విగ్రహం పెట్టకుండా కాకాణి అడ్డుకోలేదా? అంటూ ఫైర్ అయ్యారు. తనను తిడితే వైసీపీ ప్రభుత్వంలో పదవులు వస్తాయనుకొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలో ఉండి చంద్రబాబు కాళ్లకు దండం పెట్టింది కాకాణి కాదా? అని ప్రశ్నించారు. నెల్లూరు కోర్టులో దస్త్రాల చోరీ కేసును కాకాణిని జాగ్రత్తగా చూసుకోవాలని కోటంరెడ్డి సెటైర్లు వేశారు.