Bhuma Akhilapriya : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని అఖిలప్రియ ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతి, భూదందా , సెటిల్ మెంట్స్ పై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి అక్రమాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టంచేశారు. నంద్యాల గాంధీ చౌక్ వద్దకు వస్తే ఆధారాలు బహిర్గతం చేస్తానని ప్రకటించారు. అక్కడికి రావాలని కోరుతూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డికి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు అఖిల ప్రియ ఇంటి వద్దకు చేరుకున్నారు.
ఆళ్లగడ్డ నుంచి నంద్యాల గాంధీచౌక్ వెళ్లేందుకు అఖిలప్రియ సిద్ధమయ్యారు. ఆమె అక్కడకు వెళితే నంద్యాలలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడతాయని పోలీసులు భావించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్రెడ్డి సిబ్బందితో కలిసి ఆళ్లగడ్డలోని అఖిలప్రియ నివాసానికి వెళ్లారు. శాంతి భద్రతల దృష్ట్యా నంద్యాలకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. అఖిలప్రియకు గృహ నిర్బంధ నోటీసులు ఇచ్చారు. ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అఖిలప్రియను గృహ నిర్బంధం చేయడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
ఆళ్లగడ్డలో సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి ర్యాలీలు, రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.