Adani: దేశమంతా గగ్గోలు పెడుతోంది. ప్రపంచమంతా తప్పుబడుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. అదానీ షేర్లు, ఆ కంపెనీకి అప్పులు ఇచ్చిన LIC, SBI స్టాకులు భారీగా పడిపోతున్నాయి. ఇంత జరుగుంతుంటే.. ఇంత ఆందోళన వ్యక్తం అవుతుంటే.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం డోంట్ వర్రీ అన్నట్టు మాట్లాడుతున్నారు. అదానీ షేర్ల పతనం పరోక్షంగా బ్యాంకింగ్ రంగంపై ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు.
ఫారిన్ ఇన్వెస్టర్లు గతంలో మాదిరిగానే నిశ్చింతగా భారత్లో పెట్టుబడులు కొనసాగించొచ్చని నిర్మల అన్నారు. ఒక్క ఉదంతాన్ని ఆధారంగా చేసుకొని భారత మార్కెట్లను అంచనా వేయడం సరికాదన్నారు. నియంత్రణ, నిబంధనల విషయంలో దేశీయ ఫైనాన్షియల్ మార్కెట్ చాలా పటిష్ఠంగా ఉందని చెప్పారు. ఇక, అదానీ కంపెనీల్లో LIC, SBIలకు ఉన్న పెట్టుబడులు.. ఆయా కంపెనీల మొత్తం పెట్టుబడుల్లో చాలా తక్కువేనని ( ఒక శాతం కంటే తక్కువ) గుర్తు చేశారు.
మరోవైపు, కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి టి.వి సోమనాథన్ సైతం ఇలానే సమస్యను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేశారు. స్థూల ఆర్థిక వ్యవస్థ కోణంలో చూస్తే అదానీ షేర్ల పతనం వల్ల స్టాక్ మార్కెట్లో వచ్చిన గందరగోళం ‘టీ కప్పులో తుపాను’ లాంటిదని అన్నారు. స్టాక్ మార్కెట్ కదలికలపై ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళనా లేదని చెప్పారు. అదానీ గ్రూప్నకు రుణాలిచ్చిన బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే పెట్టుబడిన పెట్టిన ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీదారులు సైతం నిశ్చింతగా ఉండొచ్చని భరోసా ఇచ్చారు.