Anjaneya Temple in Kadapa:కడపకు రెండు కిలో మీటర్ల దూరంలో దేవుని కడప ఉంది .పూర్వం తిరుపతికి వెళ్ళే మార్గం ఇదే .ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన తరువాతే తిరుమల వెంకన్న ను దర్శించే వారు . ఈ విగ్రహాన్ని ప్రాముఖ ధనురాచార్యులు కృపా చార్యులు ప్రతిష్టించారని కధనం . దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళే వారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా 3 చోట్లకు వెళ్ళే భక్తులు కచ్చితంగా మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు.
తిరుమల వరాహ క్షేత్రం అయితే ఇది హనుమత్ క్షేత్రం .ఇదీ విశేషం .ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక గర్భగుడి వెనుకవైపు 13 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహముంది. ఈ ఆంజనేయస్వామి ఈ క్షేత్రానికి పాలకుడుపద్నాలుగో శతాబ్దికి చెందిన శ్రీ వేదాంత దేశికా చార్యుల వారు ఈ స్వామిని తయారు చేయించారు .హరిహర ,బుక్కరాయలు నరసింహ రాయలు కృష్ణ దేవా రాయలు ఎన్నో అమూల్య ఆభరణాలను మాన్యాలను స్వామికి అందజేశారు .అన్నమయ్య కూడా దర్శించిన క్షేత్రం ఇది .ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం.
ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఏడో రోజు మాఘ శుద్ధ సప్తమి నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. రథోత్సవంలో భాగంగా స్వామి గ్రామంలో ఊరేగుతాడు. ఈ ఆలయానికున్న మరో విశిష్టత మతసామరస్యం. ఉగాదినాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు.