Lokesh: వదల లోకేశ్ నిన్నొదల.. అన్నట్టు పోలీసులు నారా లోకేశ్ ను వెంటాడుతున్నారు. యువగళం వినిపించకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. జీవో నెంబర్ 1 ముందేసి మరీ.. ఈ పర్మిషన్ లేదు.. ఆ పర్మిషన్ లేదు అంటూ లోకేశ్ పాదయాత్రకు బ్రేకులు వేస్తున్నారు. లేటెస్ట్ గా, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో లోకేశ్ సభను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
శుక్రవారం సాయంత్రం బంగారుపాళ్యం కూడలికి చేరుకుంది యువగళం పాదయాత్ర. అక్కడ బహిరంగ సభ జరిపి లోకేశ్ ప్రసంగించేలా టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అయితే, సభకు పర్మిషన్ లేదంటూ పోలీసులు రంగంలోకి దిగారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడం.. టీడీపీ వర్గీయులు సైతం భారీగా ఉండటంతో.. వారి మధ్య తోపులాటతో హైటెన్షన్ క్రియేట్ అయింది.
సభకు అనుమతిలేదని, ప్రజలతో ముఖాముఖి నిర్వహించేందుకు మాత్రమే పర్మిషన్ ఉందని పోలీసులు చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తలు మాత్రం లోకేశ్ బహిరంగ సభ నిర్వహించాలని పట్టుబట్టారు. లోకేశ్ ప్రచార వాహనంపై నుంచి ప్రసంగించకుండా పోలీసులు అడ్డుకున్నారు.
టీడీపీ నేతలు పోలీస్ బలగాలను అడ్డుకుని.. నారా లోకేశ్ ను వాహనంలోంచి బయటకు తీసుకొచ్చి.. సమీపంలోని ఓ భవనం మీదకు తీసుకెళ్లారు. అక్కడి నుంచే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు లోకేశ్. ఇలా బంగారుపాళ్యంలో యువగళం వేడెక్కింది.
గురువారం పలమనేరులోనూ ఇలాగే ఝలక్ ఇచ్చారు పోలీసులు. మైక్ కు పర్మిషనల్ లేదంటూ నారా లోకేశ్ ప్రచార రథాన్ని సీజ్ చేశారు. లోకేశ్ టీడీపీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గి ప్రచారరథాన్ని తిరిగి ఇచ్చేశారు. తాజాగా, బంగారుపాళ్యంలో సభను అడ్డుకుని మరోసారి యువగళాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. మరి, ముందుముందు లోకేశ్ పాదయాత్రకు ఇంకెన్ని స్పీడ్ బ్రేకులు వేస్తారో పోలీసులు?
ఇక, ఎనిమిదోరోజు లోకేశ్ పాదయాత్రలో.. ‘సెల్ఫీ విత్ లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు. తనను కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు నారా లోకేశ్.