KTR: బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. గులాబీ వర్సెస్ కాషాయం. రాజకీయం యమ రంజుగా సాగుతోంది. పదునైన విమర్శలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. గులాబీ నేతలంటే కాషాయ దళానికి అసలేమాత్రం గిట్టట్లేదు. అలానే, కమలనాథులంటే బీఆర్ఎస్ వాదులు బుస్సున లేస్తున్నారు. ఇలా ఆ రెండు పార్టీ నేతల మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతుండగా.. తాజాగా అసెంబ్లీలో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. కాషాయంపై తనకున్న ధ్వేషాన్ని.. మంత్రి కేటీఆరే స్వయంగా చెప్పారు. అదికూడా కరుడుగట్టిన కాషాయవాదైన ఎమ్మెల్యే రాజాసింగ్ తో. ఇంతకీ అసెంబ్లీలో అసలేం జరిగిందంటే…
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికంటే ముందు జరిగిందీ ఆసక్తికర పరిణామం. సభలో మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లారు. ఈటలతో ముచ్చట పెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ వంతు వచ్చింది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కరుడుగట్టిన కాషాయవాది. మొదటిరోజు సభకు కాషాయ రంగు చొక్కా వేసుకునే వచ్చారు. ఆయన గుండె చీల్చినా కాషాయ రంగే ఉంటుందని అంటారు అభిమానులు. రాజాసింగ్ గెటప్ చూసి.. కేటీఆర్ ఉలిక్కిపడినట్టున్నారు. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి మరీ తన ఆక్రోషాన్ని వెళ్లగక్కారు.
చొక్కా రంగు కళ్లకు గుచ్చుకుంటుందన్నారు కేటీఆర్. కాషాయ రంగు తనకు ఇష్టం ఉండదని రాజాసింగ్ తో చెప్పారు. రాజాసింగ్ సైతం కేటీఆర్ కు బాగానే కౌంటర్ ఇచ్చారు. భవిష్యత్తులో మీరూ కాషాయ రంగు చొక్కా వేసుకోవచ్చేమోనంటూ సరదాగా సమాధానం చెప్పారు. ఇదీ జరిగింది.
కేటీఆర్ వ్యాఖ్యలు కేవలం చొక్కా రంగు వరకే పరిమితం చేసి చూడలేమంటున్నారు. కమలం పార్టీ మీద ఉన్న ధ్వేషమే.. కాషాయ రంగు మీదకు మళ్లిందని అంటున్నారు. తమ కుటుంబానికి, తమ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బీజేపీని.. ఆ పార్టీ రంగును చూసినా కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని చెబుతున్నారు. అందుకే, ఎమ్మెల్యే రాజాసింగ్ వేసుకున్న కాషాయ చొక్కా తన కళ్లకు కొడుతోందని.. ఆ రంగు అంటే తనకు ఇష్టం ఉండదని.. ఓపెన్ గానే మనసులో భావాన్ని బయటపెట్టేశారని అంటున్నారు. మరీ, అంతలా కేటీఆర్ ను డిస్టర్బ్ చేస్తోందా కాషాయం?