KTR: దేశంలోనే మొట్టమొదటిసారి ఫార్ములా ఇ-రేస్ హైదరాబాద్లో జరగనుంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ రేస్ ద్వారా హైదరాబాద్ చరిత్ర సృష్టించబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా జట్టు మహీంద్రా రేసింగ్ కూడా ఈ పోటీల్లో పాల్గొననుంది. ప్రపంచమంతా పోటీ పడి వచ్చి.. చివరికి సొంత గడ్డపై పోటీల్లో పాల్గొనడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ఆనంద్ మహీంద్రా అన్నారు.
ఈ రేసుకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఎనిమిదేళ్ల ప్రపంచవ్యాప్త రేసింగ్ తర్వాత చివరికి సొంతగడ్డపై రేసింగ్లో పాల్గొంటున్నాం. ఎఫ్ఐఏ ఫార్ములా ఈ మొదటిసారి భారత్కు వస్తోంది. కేటీఆర్కు, గ్రీన్కోకు ఈ విషయంలో ధన్యవాదాలు’’ అంటూ ఆనంద్ మహాంద్రా ట్వీట్ చేశారు.
హైదరాబాద్లోని నెక్లస్ రోడ్డులో ఫిబ్రవరి 11న ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 11 జట్లు ఈ రేసులో పాల్గొననున్నాయి. ఇప్పటికే ఈ రేసుకు సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ చేరుకున్నాయి.