KCR: ఐపాయ్. సభలో గవర్నర్ తమిళిసై ప్రసంగం. ఆల్ హ్యాపీస్. ఇదేకదా ఇన్నాళ్లూ అంతా కోరుకుంది. కేసీఆర్ ఒక్క అడుగు వెనక్కి తగ్గడంతో.. ఎన్నో అడుగులు ముందుకు పడ్డాయి. ముఖ్యంగా రాజ్యాంగ సంప్రదాయాలు సంరక్షించబడ్డాయి. సీఎం కేసీఆర్ కాస్త తగ్గి.. అందరినీ గెలిపించారని అంటున్నారు.
గవర్నర్ వర్సెస్ కేసీఆర్. ఇద్దరి మధ్య రాజ్యాంగ వార్. ఎత్తుకు పైఎత్తులతో పదే పదే ఆధిపత్యం ప్రదర్శించే రాజకీయం. చాలాకాలంగా నడుస్తోంది ఈ రగడ. ప్రభుత్వ ప్రతిపాదనలు, బిల్లులపై గవర్నర్ వ్యూహాత్మకంగా ఆలస్యం చేయడం.. రివేంజ్ గా గవర్నర్ కు ప్రోటోకాల్ మర్యాదలు ఇవ్వకపోవడం.. ఇలా నెలల తరబడి వార్. లేటెస్ట్ రిపబ్లిక్ డే వేడుకలతో అది మరింత తారాస్థాయికి చేరింది. ఏకంగా గవర్నర్ తమిళిసై.. నేషనల్ మీడియాకు ఎక్కడంతో నానా రచ్చ జరిగింది. ఇదే టైమ్ అనేలా.. బడ్జెట్ బిల్లుపై గవర్నర్ సంతకం చేయకపోవడంతో కేసీఆర్ సర్కారు కంగుతింది. హైకోర్టుకు వెళ్లడం.. ఆ వెంటనే పిటిషన్ విత్ డ్రా చేసుకోవడం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అంగీకరించడం వరుసగా జరిగిపోయాయి. శుక్రవారం.. ఆ శుభసమయం రానే వచ్చింది. గవర్నర్ తమిళిసై ప్రసంగంతో తెలంగాణ అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ స్వయంగా గవర్నర్ ను సభలోకి తోడ్కొనివచ్చారు. ఉభయసభలను ఉద్దేశించి హుందాగా ప్రసంగించారు తమిళిసై. అలా ఎన్నాళ్లో వేచిన సమయం ఆవిష్కృతమైంది.
ఇన్నాళ్లూ తెలంగాణ సర్కారుపై పలు విమర్శలు చేస్తూ వచ్చిన తమిళిసై.. అసెంబ్లీలో ఆమె నోటి నుంచే, అదే కేసీఆర్ ప్రభుత్వాన్ని కీర్తిస్తూ ప్రసంగం చదవడం ఆసక్తికర పరిణామం. తెలంగాణలో పాలన బాగుందని.. సంక్షేమ పథంలో దూసుకుపోతోందని.. వైద్య, విద్య, ఉద్యోగ జాతరతో తెలంగాణ ఆహా ఓహో అన్నట్టు ఉందనేలా గవర్నర్ ప్రసంగం సాగింది. తమిళిసై నోట ఇలా తెలంగాణ కీర్తిని వినడం అందరికంటే బీఆర్ఎస్ నేతలే ఎక్కువ ఆనందించి ఉంటారని అంటున్నారు.
గవర్నర్, సర్కార్ మధ్య రాజీ కుదరడం.. అసెంబ్లీలో తమిళిసై ప్రసంగంతో.. ఇప్పుడిక విపక్ష నేతలు విమర్శలకు పని చెప్పారు. ఇన్నాళ్లూ పులిలా గవర్నర్ పెద్ద పెద్ద మాటలు చెప్పి.. తన ప్రసంగంతో పిల్లిలా అంతా తుస్ మనిపించారని కాంగ్రెస్ సభ్యుడు జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీకి, బీఆర్ఎస్ కి గవర్నర్ బీ టీమ్ గా మారారని ఆరోపించారు. మరోవైపు, గవర్నర్ ప్రసంగం అబద్దాల పుట్ట.. ప్రభుత్వం ఇచ్చిన ప్రతిని గవర్నర్ చదివారు.. ధరణి ప్రస్తావన లేదు.. అంటూ బీజేపీ మెంబర్ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆహా.. క్యా బాత్ హై. ఇన్నాళ్లూ గవర్నర్ విషయంలో సర్కారును పదే పదే తప్పుబట్టిన కాంగ్రెస్, బీజేపీలు.. ఇప్పుడు సర్కారు తరఫున గవర్నర్ చేసిన ప్రసంగాన్ని తప్పుబట్టడం రాజకీయంగా ఇంట్రెస్టింగ్ పాయింట్..అంటున్నారు.