New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం వివాదం రాజేసింది. ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గాంధీభవన్ నుంచి కొత్త సచివాలయానికి కాంగ్రెస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించారు. సచివాలయం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంపై వెలువడుతున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని మండిపడ్డారు.
మరోవైపు అగ్ని ప్రమాదం జరగలేదని మాక్ డ్రిల్ మాత్రమే నిర్వహించామని పోలీసులు అంటున్నారు. ఇంకోవైపు సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి ప్రకటించారు. ప్లాస్టిక్ సామాగ్రికి మంటలు వ్యాపించాయని తెలిపారు. ప్రభుత్వం, పోలీసులు భిన్నప్రకటనలు చేయడంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. తాము ఘటనాస్థలికి వెళ్లి తెలుసుకుంటామని పట్టుబట్టారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. మల్లురవి, షబ్బీర్ అలీని గాంధీభవన్ వద్దే అరెస్టు చేశారు. దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నేతలను అరెస్టు చేసిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
రేవంత్ ట్వీట్..
కొత్త సెక్రటేరియట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ అగ్ని ప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసి మారేడు కాయ చేయడం తప్పని మండిపడ్డారు. కేసీఆర్ పుట్టిన రోజే ప్రారంభించాలనే ఒత్తిడితో ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. కేసీఆర్ పుట్టిన రోజు ప్రారంభించడానికి ఇదేమైన రాచరికమా అని రేవంత్ ప్రశ్నించారు. అగ్ని ప్రమాదం పై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలని రేవంత్ డిమాండ్ చేశారు.