Kakani Govardhanreddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ పై వైసీపీ ఎదురుదాడిని కొనసాగిస్తోంది. తాజాగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించలేదని నిలదీశారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్ అని సెటైర్లు వేశారు. శ్రీధర్రెడ్డిని చంద్రబాబు ట్యాప్ చేశారని ఆరోపించారు.
అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. ఆడియో రికార్డే అని శ్రీధర్రెడ్డి అంతరాత్మకు తెలుసని మంత్రి కాకాణి అన్నారు. కోటంరెడ్డి మాటలకు టీడీపీ నేతలు వంతపాడుతున్నారని మండిపడ్డారు. అవమానం జరిగిందని భావిస్తే దానిపై మాట్లాడకుండా 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆడియో క్లిప్లో ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గౌరవం, గుర్తింపు వైఎస్ఆర్ కుటుంబంతోనే వచ్చిందన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ను చూసి ప్రజలు ఓటేశారని ఎమ్మెల్యే పదవి ఆయన పెట్టిన భిక్ష కాదా? అని ప్రశ్నించారు. జగన్కు వీరవిధేయుడినని చెప్పుకొని ఇప్పుడు వేరే వాళ్లకు విధేయుడయ్యారని మండిపడ్డారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో పొరపాట్లు జరిగినా జగన్ .. కోటంరెడ్డిని విశ్వసించారని అందుకే అక్కడ వేరే వాళ్లకు అవకాశం ఇవ్వలేదన్నారు. నిజంగా శ్రీధర్రెడ్డిపై అనుమానముంటే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేవారా? అని నిలదీశారు. మొన్నటి వరకు ఆయన చెప్పిందే అక్కడ జరిగిందన్నారు.
2014 ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో ఎంత పోటీ ఉందనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలుసని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పార్టీ జీవనదిలాంటిదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు వైసీపీ నుంచి వెళ్లిపోయినా ఏమాత్రం భయపడకుండా పోరాడిన నేత జగన్ అన్నారు. ఇప్పుడు ఒకరో ఇద్దరో పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన నష్టం లేదన్నారు. కోటంరెడ్డి నిర్ణయం ఆత్మహత్యా సదృశంగా పేర్కొన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడి జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిప్డడారు. ఈ విషయంతో ఏమాత్రం సంబంధం లేని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు సరికాదన్నారు.