Pawan: ముందు ఆనం.. ఆ తర్వాత కోటంరెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వైసీపీని కుదిపేస్తోంది. సొంతపార్టీ నేతలే సీఎం జగన్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. కట్ చేస్తే, అలా అన్నందుకు వారిపై యాక్షన్ మొదలైంది. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సెక్యూరిటీని తగ్గించారు. దీంతో తనకు ప్రాణభయం ఉందని.. తనపై రెక్కీ చేస్తున్నారని.. భౌతికంగా అంతమొందించే కుట్ర జరుగుతోందంటూ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు.
వైసీపీలో జరుగుతున్న వరుస పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాణభయంతో ఉన్నారని అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి రక్షణ సిబ్బందిని తగ్గించారని, ఆయన ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానన్నారు జనసేనాని.
‘‘రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర హోంశాఖకు తెలియజేస్తాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాణభయంతో ఉన్నారు. వారు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. సీఎం జగన్ ఆయన కార్యాలయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోం మంత్రి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రాణహాని ఉందని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.