Sharmila: ఏమాటకు ఆమాటే అనుకోవాలి. షర్మిల రాజకీయాలు మామూలుగా ఉండవు. కొమ్ములు తిరిగిన నేతల మాదిరే ఉంటున్నాయి. పాదయాత్ర చేయడం.. పదునైన విమర్శలు చేయడం.. పాదయాత్ర అడ్డుకుంటే ప్రగతిభవన్ ముట్టడించడం.. ధర్నాలు చేయడం.. ఇలా రచ్చ రచ్చ చేసి తన ఉనికిని బలంగా చాటుకోవడంలో సక్సెస్ అయ్యారు షర్మిల. లేటెస్ట్ గా పాదయాత్ర పున:ప్రారంభం సందర్భంగా అలాంటి రాజకీయమే మరోసారి చేశారు. సీఎం కేసీఆర్ కు షూ గిఫ్ట్ గా పంపించి కలకలం రేపారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తనతో కలిసి పాదయాత్ర చేయాలంటూ కేసీఆర్ కు షూను బహుమతిగా పంపారు షర్మిల. తన పాలన అద్భుతం అంటున్న కేసీఆర్.. తనతో ఒక్కరోజు పాదయాత్ర చేస్తే ప్రజాసమస్యలు తెలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి ఇంటికి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. ఒకవేళ సమస్యలున్నట్లు తేలితే కేసీఆర్ రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. షర్మిల వేసిన షూ ఎత్తుగడకు మంచి ప్రచారమే వచ్చింది. అయితే, షర్మిల నువ్వేమైనా కొత్తగా షూ కంపనీ పెట్టావా? అంటూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సెటైర్ వేశారు.
పాదయాత్రకు ముందు గవర్నర్ తమిళిసైతో సమావేశం కావాలని అనుకున్నారు. కానీ, ఆలస్యం అవుతుండటంతో గవర్నర్ ను కలవకుండానే వెళ్లిపోయారు. యాత్రపై ఆవిధంగానూ తన చిత్తశుద్ధి చాటుకున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించారు.
మరోవైపు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీపైనా షర్మిల స్పందించారు. పొంగులేటి వైఎస్సార్ టీపీలో చేరుతానని తనకు హామీ ఇచ్చారని అన్నారు. మిగతా విషయాలు ఆయన్నే అడగాలని చెప్పారు.
అయితే, షర్మిల వ్యాఖ్యలను పొంగులేటి ఖండించారు. తాను ఏ పార్టీలో చేరుతాననేది ఇప్పుడే చెప్పలేనని.. తన గురించి అన్నిపార్టీలు క్లెయిమ్ చేసుకోవడం సాధారణ విషయమేనన్నారు పొంగులేటి.