Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనాలు కంటిన్యూ అవుతున్నాయి. కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ.. రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో బ్రేకింగ్ న్యూస్ లు అనేకం ఉన్నాయి. ఈసారి చార్జిషీట్లో ఏకంగా ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పేరును చేర్చింది ఈడీ. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఓ స్కాంలో నేరుగా ముఖ్యమంత్రినే నిందితుడిగా చేర్చడం మామూలు విషయం కానే కాదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేరుగా సీఎం కేజ్రీవాల్ కు ప్రమేయం ఉందనే అనుమానంతో ఆయన పేరును నమోదు చేసింది ఈడీ. ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు ఉండగా.. ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ పేరును సైతం చేర్చడం సంచలనంగా మారింది. అయితే, మనీష్ సిసోడియా ఇళ్లు, కార్యాలయాల్లో పలుమార్లు తనిఖీలు చేసిన దర్యాప్తు సంస్థలు పెద్దగా ఆధారాలు సేకరించలేకపోయాయని తెలుస్తోంది. అయినా, ఈసారి డిప్యూటీ సీఎం నుంచి నేరుగా సీఎంకు ఉచ్చు బిగించేలా చార్జిషీట్లో పేరు నమోదు చేయడంపై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి.
అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయడం లేదంటూ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనడానికి, ప్రభుత్వాలను పడగొట్టడానికే ఈడీ పని చేస్తోందంటూ విమర్శలు చేశారు.
ఇక, ఈడీ రెండో చార్జిషీటు తెలుగు రాష్ట్రాలను సైతం షేక్ చేస్తోంది. ఎమ్మెల్సీ కవిత పేరును మరోసారి చార్జిషీట్లో చేర్చింది ఈడీ. సాక్షాలను ధ్వంసం చేసిన కేటగిరీలో కవిత పేరు నమోదు చేసింది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్టు ఈడీ వివరించింది. వి.శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని ఛార్జిషీట్లో ప్రస్తావించింది. కవిత ఆదేశంతో అరుణ్పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ వెల్లడించింది.
వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి పేరు కూడా ఈడీ రెండో చార్జిషీటులో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొత్తం 17 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది ఈడీ.
ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఛార్జిషీట్లో పేరున్న నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.