Yuvagalam: యువగళం పేరుతో నారా లోకేశ్ సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పంలో యువగళం ఆరంభం నుంచే.. ఈ యాత్రను కొనసాగనిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే, లోకేశ్ పాదయాత్రకు ముందునుంచీ కొర్రీలు పెడుతూనే వస్తోంది ప్రభుత్వం. జీవో నెంబర్ 1 తీసుకొచ్చి.. పర్మిషన్ కోసం చుక్కలు చూపించారు. ఎట్టకేళకు అనుమతి అయితే ఇచ్చారు కానీ.. ముందుముందు పోలీసుల తీరు ఎలా ఉంటుందో అనే అనుమానాలు మాత్రం వీడలేదు.
అందుకు తగ్గట్టే.. చిత్తూరు జిల్లా పలమనేరులో యువగళంకు ఝలక్ ఇచ్చారు పోలీసులు. నారా లోకేశ్ ప్రచారరథం మైక్కు అనుమతి లేదంటూ ఆ వాహనాన్ని పలమనేరు పోలీసులు సీజ్ చేశారు.
పాదయాత్రలో భాగంగా క్లాక్ టవర్ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రచార రథం మీదనుంచి మాట్లాడారు నారా లోకేశ్. ప్రసంగం అయిపోయాక.. లోకేశ్ మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. అంతలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. పాదయాత్రలో మైక్ కు అనుమతి లేదంటూ ప్రచారరథాన్ని సీజ్ చేశారు పోలీసులు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు నారా లోకేశ్. ఏ రాజ్యాంగం, ఏం చట్టం ప్రకారం వాహనాన్ని సీజ్ చేశారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 రాజ్యాంగానికి వ్యతిరేకమని మండిపడ్డారు. లోకేశ్ కు మద్దతుగా టీడీపీ శ్రేణులు సైతం ఆందోళనకు దిగారు. దీంతో, వెనక్కి తగ్గిన పోలీసులు ప్రచార రథాన్ని విడిచిపెట్టారు. లోకేశ్ యువగళం పాదయాత్రను కొనసాగించారు.
ఇది జస్ట్ శాంపిలేనా? ముందుముందు పోలీసుల నుంచి ఇలాంటి అడ్డంకులు మళ్లీ మళ్లీ వస్తాయా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ వర్గీయులు. యువగళానికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే.. పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు టీడీపీ శ్రేణులు.