Adani Withdraws FPO:అదానీ గ్రూపు కంపెనీల్లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలతో… ఆ కంపెనీల షేర్లన్నీ కుప్పకూలుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఎఫ్పీవోకు కూడా అంతంత మాత్రం స్పందనే లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు అదానీ గ్రూపు కంపెనీల ఉద్యోగులు కూడా ఎఫ్పీవోపై ఆసక్తి కనబరచకపోవడంతో… సంస్థాగత, సంస్థాగతేతర ఇన్వెస్టర్లు మద్దతుగా నిలిచి, ఇష్యూ పూర్తిగా సబ్స్క్రైబ్ అయ్యేలా చూశారు. అయితే, కంపెనీ షేర్లు నేలచూపులు చూస్తున్న సమయంలో… ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ను ఉపసంహరించుకోవాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది.
ప్రస్తుతం పరిస్థితులు బాగా లేకపోవడం, మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్నందున… ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇష్యూను ఉపసంహరించుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. ఎఫ్పీవో ద్వారా సేకరించిన నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి ఇస్తామని… సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. తమ కంపెనీ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగానే ఉందని, రుణ చెల్లింపుల్లో మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు… గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో, సంపద కూడా ఆ స్థాయిలోనే కరిగిపోయి… ప్రపంచ కుబేరుల జాబితాలో 15వ స్థానానికి చేరారు… గౌతమ్ అదానీ. అంతేకాదు… ఆసియా కుబేరుల్లోనూ తొలి స్థానాన్ని కోల్పోయారు. అదానీని వెనక్కి నెట్టిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ… ఆసియా సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో నిలిచారు.
హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర పతనమైంది. వారం కిందటి వరకూ ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న అదానీ… బుధవారానికి 15వ స్థానానికి పడిపోయారు. 2022లో కూడగట్టిన 44 బిలియన్ డాలర్ల సంపదను ఒక్క వారంలో పోగొట్టుకున్న అదానీ… ప్రస్తుతం 75 బిలియన్ డాలర్ల సంపదతో మిగిలారు.