Nirmala Sitharaman: 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిర్మలా సీతారమన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఈక్రమంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరో ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ నిలిచారు. అంతకంటే ముందు అరుణ్ జైట్లీ, యశ్వంత్ సిన్హా, పి.చిదంబరం, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ వరుసగా ఐదు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
దేశ చరిత్రలోనే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా.. 1959-60 నుంచి 1963-64 మధ్యలో వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఆ తర్వాత మన్మోహన్ సింగ్ 1991-92 నుంచి 1995-96 వరకు ఐదు పద్దులు పార్లమెంట్ ముందు ఉంచారు. ఇక 1998-99 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన యశ్వంత్ సిన్హా.. 1999-2000 నుంచి 2002-03 వరకు వరుసగా నాలుగుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
పి.చిదంబరం 2004-2005 నుంచి 2008-2009 వరకు ఐదుసార్లు బడ్జెట్ను పార్లమెంట్ ముందు ఉంచారు. ఇక మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా 2014-15 నుంచి 2018-19 వరకు వరుసగా ఐదుసార్లు బడ్జెట్ను పార్లమెంట్ ముందుంచారు.