Chinese Company:ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ ఉద్యోగుల్ని భారీగా తీసేస్తున్నాయి. అలాగే పొదులు చర్యలు పాటిస్తూ ఖర్చుల్ని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, ఓ కంపెనీ మాత్రం ఉద్యోగుల్ని తీసేయకపోగా… భారీగా బోనస్ ప్రకటించింది. కళ్ల ముందే నోట్ల కట్టల్ని గుట్టలుగా పోసి మరీ… ఉద్యోగులకు పంచింది. ఆ కంపెనీ… చైనాది కావడమే ఇక్కడ అసలు విశేషం.
చైనాలో కరోనా కారణంగా చాలా కంపెనీలు భారీగా నష్టపోయాయి. మరికొన్ని బొటాబొటి లాభాలతో ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయిలో ఆదాయం గడించాయి. కానీ, పొక్లెయిన్ల తయారీ సంస్థ అయిన ‘హెనాన్ మైన్’ భారీగా లాభాల్ని సాధించింది. దీనికి కారణమైన ఉద్యోగులకు ఊహించని విధంగా భారీ స్థాయిలో బోనస్లు ప్రకటించింది. అంతేకాదు… మూడో కంటికి తెలీకుండా నేరుగా ఉద్యోగుల అకౌంట్లలో బోనస్ డబ్బుల్ని వేయడం ఎందుకని అనుకుందో ఏమో… బోనస్ పంపిణీ కార్యక్రమాన్ని వెరైటీగా, అట్టహాసంగా చేపట్టింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్ మొత్తాన్నీ… నోట్ల కట్టల రూపంలో గుట్టలుగా పోసింది… ‘హెనాన్ మైన్’ కంపెనీ. నోట్ల కట్టల్ని తీసుకునేందుకు బ్యాగులతో రావాలని ఉద్యోగులకు సూచించింది. బ్యాగులు పట్టుకొచ్చిన ఉద్యోగులు… అందంగా పేర్చిన నోట్ల కట్టల్ని బ్యాగుల్లో వేసుకునే దృశ్యాలు… సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇంతకీ ‘హెనాన్ మైన్’ కంపెనీ ఎంత మంది ఉద్యోగులకు ఎంత బోనస్ ఇచ్చిందో తెలుసా? మన కరెన్సీలో దాదాపు రూ.110 కోట్లను మొత్తం 70 మంది ఉద్యోగులకు పంచింది. 40 మంది సేల్స్ మేనేజర్లకు ఒక్కొక్కరికి రూ.1.8 కోట్లు… మరో 30 మంది సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.1.2 కోట్ల బోనస్ ఇచ్చింది… ‘హెనాన్ మైన్’ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల విలువైన కంపెనీలు కూడా ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగుల్ని తొలగిస్తుంటే… కరోనా కష్టకాలంలోనూ బోనస్ పంచడం గ్రేట్ అంటూ అంతా ‘హెనాన్ మైన్’ కంపెనీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఉద్యోగాలు చేసే అందరికీ ఇలాంటి బాస్ ఉంటే బాగుంటుంది కదా!