Pakistan : పాకిస్థాన్ లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పెషావర్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 93 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. బాధితులను వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పెషావర్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్ లైన్స్లోని ఓ మసీదులో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 20 మంది పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆత్మహుతి దాడి ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మండిపడ్డారు. పాకిస్థాన్ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని, ఉగ్రవాదులు భయాన్నిసృష్టించాలని అనుకుంటున్నారని విమర్శించారు.
సోమవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు పాకిస్థాన్లో పర్యటించాల్సి ఉంది. ఆ సమయంలోనే ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆ పర్యటన కాస్తా రద్దయింది. అలాగే పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు దేశంలో ఇలాంటి ఉగ్రదాడులు జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.