Pakistan Surrender:తీవ్రాతి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్… ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్ను పొందేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. కరెన్సీపై పట్టు సడలించడంతో పాటు… ఇంధర ధరలను భారీగా పెంచేస్తోంది. దాంతో… డాలరుతో పోలిస్తే పాక్ రూపాయి మారకం విలువ ఏకంగా 270కి పడిపోయింది. ఇక పెట్రోల్, డీజిల్ ధరల్ని ఒక్కరోజే ఏకంగా రూ.35 పెంచింది. ప్రస్తుతం పాకిస్థాన్లో లీటర్ పెట్రోల్ రూ.250, లీటర్ డీజిల్ రూ.262గా ఉంది. అటు రూపాయి విలువ పడిపోవడం, ఇటు ఇంధర ధరలు భారీగా పెరిగిపోవడంతో… అసలే కష్టాల్లో ఉన్న పాక్ జనం… సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 3.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇవి ఒక నెల దిగుమతులకు కూడా సరిపోవు. ఇప్పటికిప్పుడు భారీగా విదేశీ మారక ద్రవ్యం అవసరం కావడంతో… 6.5 బిలియన్ డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్ పెట్టిన షరతులన్నింటికీ పాకిస్థాన్ తలొగ్గుతోంది. ఇప్పటికే కరెన్సీ విలువపై నియంత్రణ సడలించి, పెట్రో ధరల్ని పెంచిన పాక్… ఇకపై పన్నులు, గ్యాస్ ధరలను పెంచడం వంటి ఇతర కఠిన నిర్ణయాలను కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఐఎంఎఫ్ కు తెలిపింది.
పాకిస్థాన్లో జాతీయ ఎన్నికలకు ఇక కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో.. ఆలోగానే ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్రణాళిక పూర్తి చేయాలని… ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకే రూపాయి విలువ పతనమైనా లెక్కచేయడం లేదు. డాలరుతో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ సమీప కాలంలో 266 దగ్గర స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు… ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందిపడ్డా… పన్నుల భారం వేసేందుకు మాత్రం వెనుకాడకూడదనే వైఖరితో పాక్ పాలకులు ఉన్నారు. దాంతో… సంకీర్ణ ప్రభుత్వ నిర్ణయాలపై పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తినేందుకు తిండి కూడా లేని పరిస్థితుల్లో… అడ్డగోలుగా పన్నులు, ధరలు పెంచేస్తే ఎలా? అని దుమ్మెత్తిపోస్తున్నారు. చరిత్రలోనే అత్యంత కఠిన సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న పాకిస్థాన్… ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.