Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై మరోసారి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఢిల్లీలో లీలా ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటించారు. విశాఖపట్నం రాజధాని కాబోతోందని వెల్లడించారు. త్వరలో సీఎం కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తామని వెల్లడించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ ..విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి పారిశ్రామికవేత్తల సహకారం అవసరం ఉందన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. సింగిల్ డెస్క్ సిస్టమ్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్ వన్గా ఉందని సీఎం జగన్ తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనే రాష్ట్రానికి ఈ స్థానం దక్కిందన్నారు. ఏపీ 11.43 శాతం వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందన్నారు. దేశంలో ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రీయల్ కారిడార్లలో.. 3 ఏపీకే రావడం శుభపరిణామంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
మొత్తంమీద ఢిల్లీ వేదికగా సీఎం జగన్ రాజధానిపై మరోసారి స్పష్టతనిచ్చారు. విశాఖలో నుంచి పరిపాలన సాగించాలని నిర్ణయించారు. ఆ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారని తాజాగా చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. త్వరలోనే సీఎం కార్యాలయాన్ని తరలిస్తామని చెప్పారు. మరి ఎప్పుడు తరలిస్తామనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. రాష్ట్రంలో మరో 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వచ్చే ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.