Top 10 Billionaires List:హిండెన్బర్గ్ దెబ్బకు అదానీ గ్రూప్ విలవిలలాడిపోతోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ ఐదున్నర లక్షల కోట్లకు పైగా తగ్గిపోగా… ఇప్పుడు గౌతమ్ అదానీ సంపద కూడా ఐస్ ముక్కలా కరిగిపోతోంది. దాంతో… ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన తొలి పది మందిలో స్థానం కోల్పోయారు. ప్రస్తుతం అదానీ 11వ స్థానంలో ఉన్నారు.
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం… అదానీ గ్రూప్ 3 రోజుల్లో 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది. 3 రోజుల వ్యవధిలోనే అదానీ కూడా వ్యక్తిగతంగా 34 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. ప్రస్తుతం ఆయన 84.4 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. హిండెన్బర్గ్ నివేదిక బయటకు రాక ముందు… ఆయన మూడో స్థానంలో ఉండేవారు. అవకతవకల ఆరోపణలతో గ్రూపు కంపెనీల షేర్లు దారుణంగా పడిపోవడంతో… సంపద తగ్గిపోయి, కుబేరుల జాబితాలో అదానీ స్థానం కూడా పడిపోతూ వస్తోంది.
హిండెన్బర్గ్ దెబ్బకు కుదేలైన అదానీకి… ఇప్పుడిప్పుడే కాస్త ఊరటనిచ్చే పరిణామాలు మొదలయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో-ఆన్ షేర్ సేల్లో సుమారు 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు… అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ తెలిపింది. అంటే భారత కరెన్సీలో రూ.3,260 కోట్లు. షేరు విలువ భారీగా పతనమైన తర్వాత కూడా… అదానీ గ్రూప్ ఫండమెంటల్స్ మీద నమ్మకం ఉందని ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ వ్యాఖ్యానించింది. ఈ పెట్టుబడి ద్వారా అంతర్జాతీయంగా తమ కంపెనీపై నమ్మకం పెరుగుతుందని… అదానీ గ్రూప్ ధీమా వ్యక్తం చేసింది. రూ.20 వేల కోట్ల ఫాలో-ఆన్ షేర్ విక్రయాన్ని ప్రారంభించాక, తొలి రోజే రూ.6 వేల కోట్లు సమకూరాయని అదానీ గ్రూప్ తెలిపింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం ఈ ఫాలో-ఆన్ షేర్ విక్రయంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పటిదాకా కేవలం 4 శాతం మంది మాత్రమే ఫాలో ఆన్ షేర్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు.