Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ మంగళ్ హాట్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. రాజా సింగ్ తన వ్యాఖ్యలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ నోటీసులకు సమాధానం చెప్పకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏం జరిగింది?
జనవరి 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజాసింగ్ మాట్లాడారని పోలీసులు అంటున్నారు.
తగ్గదేలే..
మంగళ్ హాట్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. నోటీసులు ఇచ్చినా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ధర్మం కోసం చేస్తున్న పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో తాను చేసిన వ్యాఖ్యలపైనా రాజాసింగ్ వివరణ ఇచ్చారు. గో హత్య, మతమార్పిడులు, లవ్ జిహాద్పై చట్టం చేయాలని కోరానని తెలిపారు. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయని ప్రశ్నించారు. ముంబైలో మాట్లాడితే తనకు తెలంగాణ పోలీసులు ఎలా నోటీసులు ఇస్తారని రాజాసింగ్ నిలదీశారు.
గతంలో రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం పీడీ యాక్టు నమోదు చేసింది. ఈ కేసులో చాలారోజులు జైల్లో ఉన్న ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యల చేయవద్దని స్పష్టం చేసింది. కోర్టు పేర్కొన్న బెయిల్ షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని పోలీసులు అంటున్నారు. అందుకే నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. మరి రాజాసింగ్ తన వ్యాఖ్యలపై పోలీసులకు వివరణ ఇస్తారా? ఆ నోటీసులకు రాజాసింగ్ సమాధానం చెప్పకపోతే పోలీసుల నెక్ట్స్ స్టెపేంటి?