Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఏడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రౌపదీ ముర్ము లోక్సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. 9 ఏళ్ల మోదీ పాలనాలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు.
దేశం ఆత్మనిర్భర్ భారత్గా ఆవిర్భవిస్తోందని రాష్ట్రపతి తెలిపారు. పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. గత 9ఏళ్లలో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఇప్పుడు యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందని తెలిపారు. వచ్చే పాతికేళ్లలో భారతం మరింత వికాశం దిశగా అడుగులు పడాలని స్పష్టం చేశారు. 2047 నాటికి దేశాన్ని ఆత్మ నిర్భర్ భారతంగా తీర్చిదిద్దాలన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు. ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైందని రాష్ట్రపతి పేర్కన్నారు.
సాంకేతికతను అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు తీసుకొచ్చామన్నారు. డిజిటల్ ఇండియా దిశగా భారత్ ముందుకెళ్తోందని తెలిపారు. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు అవుతున్నాయని వెల్లడించారు. దేశ ప్రజల అభివృద్ధి, రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయంగా వ్యవహరిస్తోందని తెలిపారు. అందుకే ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు.
పేదల అభివృద్ధే లక్ష్యం..
పేదలు, గిరిజనులు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. మూడు కోట్ల మందికి సొంత ఇళ్లు నిర్మించామన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.
రైతులకు భరోసా..
చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటున్నామని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. రైతులకు కోసం చేపట్టిన పథకాల గురించి వివరించారు. ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డు లాంటి పథకాలు తీసుకొచ్చామన్నారు. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
మహిళా సాధికారత..
మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో వివరించారు. తొలిసారి దేశంలో పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉందని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సైన్యంలో అవకాశాలు కల్పించామన్నారు. మహిళా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు. బేటీ బచావో – బేటీ పడావో విజయవంతమైందన్నారు.
అభివృద్ధి పథంలో..
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్యక్రమాలతో దేశ రక్షణ ఎగుమతులు 6 రెట్లు పెరిగాయని రాష్ట్రపతి తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి స్వదేశీ విమాన వాహకనౌక నావికాదళంలో చేరిందన్నారు. మరోవైపు అంతరిక్ష శక్తిగా ఎదిగేందుకు భారత్ అడుగులు వేస్తోందన్నారు. ఇటీవల ప్రైవేట్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అవలంబిస్తున్న కఠిన వైఖరిని ప్రపంచం అర్థం చేసుకుంటోందని రాష్ట్రపతి తెలిపారు. జీ20 సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారత్ సభ్య దేశాలతో కలిసి ప్రపంచ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని రాష్ట్రపతి స్పష్టం చేశారు.