Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయలు దేరారు. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వెళ్లారు. సాయంత్రం 5:03 కి విమానం ఎక్కారు. ఫ్లైట్ టేకాఫ్ అయింది. సీఎంకు సెండాఫ్ పలికిన అధికారులు రిటర్న్ అయ్యారు. కట్ చేస్తే…
ఢిల్లీ వెళ్లాల్సిన ఆ విమానం తిరిగి 5:26 కల్లా మళ్లీ గన్నవరం విమానాశ్రయంలోనే ల్యాండైంది. ఈసారి ఎమెర్జెన్సీ ల్యాండ్. విషయం తెలిసి అంతా హడలిపోయారు.
విమానంలో సీఎం జగన్ తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిలు ఉన్నారు.
ఫ్లైట్ గన్నవరం నుంచి బయలు దేరాక.. విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్టు గుర్తించారు పైలైట్. వెంటనే రిటర్న్ తీసుకుని.. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాదం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విమానంలో లోపం ఇప్పటికిప్పుడు సరిదిద్దే సమస్య కాకపోవడంతో తాడేపల్లికి తిరిగి వెళ్లిపోయారు సీఎం జగన్. సోమవారం నాటి ఢిల్లీ టూర్ రద్దు చేసుకున్నారు. మంగళవారం ఉదయం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు.
సీఎం జగన్ ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తడాన్ని సెక్యూరిటీ వింగ్ సీరియస్ గా తీసుకుంది. వెంటనే విచారణకు ఆదేశించింది. విమానంలో ఏసీ పని చేయట్లేదని తెలుస్తోంది.