Telangana: డైలాగ్ 1: “దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేయండి.. మేం అసెంబ్లీ రద్దు చేస్తాం. అంతా కలిసే ముందస్తుకు పోదాం”.. బీజేపీకి కేటీఆర్ సవాల్.
డైలాగ్ 2: “తెలంగాణలో ముందస్తుకు బీజేపీ రెడీ. దమ్ముంటే ఇదే విషయం కేసీఆర్ తో చెప్పించు”.. కేటీఆర్ కు బండి సంజయ్ ప్రతిసవాల్.
డైలాగ్ 3: “ముందస్తుకు వెళ్తే సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఓడిపోతారు”.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్.
ఇదీ మేటర్. అంతా ముందస్తుకు మేం రెడీ అంటే మేం రెడీ అంటూ తొడలుకొడుతున్నారు. కానీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అన్నిపార్టీలు తెల్లముఖం వేయాల్సిందే అంటున్నారు.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆ ఓటింగ్ పైనే బీజేపీ గంపెడు ఆశలు పెట్టుకుంది. కేసీఆర్ మీద కోపంతో.. కమలం గుర్తుపై బటన్ నొక్కేస్తారని ఆశ పడుతోంది. కమలనాథులకు అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా.. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే పనులు మొదలుపెట్టేశారు.
కేసీఆర్ సచివాలయానికి రారు.. అనే విమర్శకు చెక్ పెట్టేలా కొత్త సెక్రటేరియట్ ను రెడీ చేశారు. తన బర్త్ డే రోజునే ఓపెనింగ్ కూడా పెట్టేసుకున్నారు. అటు, ఎన్నికల సమయంలో కీ రోల్ ప్లే చేసే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి.. ఆ డ్యామేజ్ ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కంటి వెలుగుతో వృద్ధుల ఓటుబ్యాంకుపై కన్నేశారని అంటున్నారు. కానీ.. కేసీఆర్ సర్కారు చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయనే విషయం గుర్తు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, అందరికీ దళితబంధు, పెన్షన్లు.. ఇలా పెద్ద లిస్టే చదువుతున్నారు. అందుకే, ముందస్తుకు వెళ్తే కేసీఆరే రిస్క్ అనేది విపక్షం లెక్క.
అధికారపక్షం వీక్ గా ఉన్నంత మాత్రాన బీజేపీ, కాంగ్రెస్ ఏమీ స్ట్రాంగ్ గా లేవంటున్నారు. కమలనాథులకు ఇప్పటికి 119 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారా? అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. గోడ దూకొచ్చే పక్క పార్టీ నేతలే ఆ పార్టీకి దిక్కు అంటున్నారు. ముందస్తు వస్తే.. బీఆర్ఎస్ లానే బీజేపీకీ కంగారే అనే టాక్ వినిపిస్తోంది.
ఇక, కాంగ్రెస్ పరిస్థితి అసలేమాత్రం బాలేదంటున్నారు. రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ జగడం సద్దుమనిగినా.. వారింకా కలిసిపోలేదు. కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ ను ఎవరో ఓడించనవసరం లేదు.. వారిని వారే ఓడించుకుంటారనే డైలాగ్ ఈసారి కూడా కరెక్టే అవుతుందని చెబుతున్నారు. అందుకే, కనీసం ముందస్తుకు డిమాండ్ చేసే ధైర్యం కూడా కాంగ్రెస్ చేయట్లేదని అంటున్నారు.
ఇలా, లోలోన అన్ని పార్టీల్లో ఎన్నికల గుబులు కనిపిస్తున్నా.. పైకి మాత్రం ముందస్తుపై సవాళ్లు, ప్రతిసవాళ్లతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. కేటీఆర్ సవాల్ చేస్తే.. మోదీ పార్లమెంట్ ను రద్దు చేస్తారా? లేదంటే, బండి కమాన్ అంటే కేసీఆర్ ముందస్తుకు వెళతారా? సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతారా? ఇవన్నీ పాలి..ట్రిక్సే అనే సంగతి తెలీనంత అమాయకులమేం కాదని మండిపడుతున్నారు జనాలు.