TS Police : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి – TSLPRB కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో కొన్ని ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించింది. అయితే మల్టీపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ కు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు కలపనున్నారు. మార్కులు కలిపిన తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 15 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. అర్హత సాధించిన అభ్యర్థుల హాల్టికెట్ నంబర్లను www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
ఫిజికల్ ఈవెంట్స్ ఎవరికంటే..
గతంలో దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనని వారికే ఇప్పుడు ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఇప్పుడు మార్కులు కలపడం వల్ల కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ల్లో ఫిజకల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. 15 రోజుల్లో ఈవెంట్ పూర్తి చేస్తారు. అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 8 ఫిబ్రవరి 10 మధ్య TSLPRB వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్లో ఏవైనా సమస్యలుంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలి.
మార్కులు కలపడం వల్ల అర్హత సాధించే అభ్యర్థులు ఆన్లైన్లో పార్ట్–2 దరఖాస్తును నింపాలని TSLPRB సూచించింది. ఫిబ్రవరి 1 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 5 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తులను పూర్తిచేసేందుతు సమయం ఇచ్చారు. ఎస్సై లేదా కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించి… బోర్డు తాజా నిర్ణయంతో రాతపరీక్షలో అర్హత సాధించే అభ్యర్థులు కూడా మళ్లీ పార్ట్–2 దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు.. ఇప్పుడు కొత్తగా మార్కులు కలపడం వల్ల రాతపరీక్షలో ఉత్తీర్ణులైనా వారికి మరో అవకాశం ఇవ్వమని TSLPRB స్పష్టం చేసింది.