Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. టీడీపీ యువత ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. పేదల సమస్యలను వింటున్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీ వర్గాలపై లోకేశ్ ప్రత్యేక శ్రద్ధపెట్టారు. బీసీల్లోని వివిధ సామాజికవర్గాల ప్రజలను కలుస్తున్నారు.
నాలుగో రోజు కుప్పం నియోజకవర్గంలోని చెల్దిగానిపల్లె నుంచి ప్రారంభమై పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దారి పొడవునా ప్రజలతో లోకేశ్ మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. లోకేశ్తో సెల్ఫీలు తీసుకునేందుకు విద్యార్థులు, యువత పోటీపడ్డారు. వి.కోట మండంలోని చెక్పోస్టు కూడలిలో భారీ గజమాలతో టీడీపీ శ్రేణులు లోకేశ్ కు స్వాగతం పలికాయి. చెల్దిగానిపల్లె నుంచి పలమనేరు నియోజకవర్గంలోకి వెళ్లే మార్గంలో కొంత ప్రాంతం కర్ణాటక పరిధిలోకి ఉంటుంది. ఆ సమయంలో లోకేష్ కు కర్నాటక పోలీసులు భద్రత కల్పించారు. సోమవారం రాత్రి కృష్ణాపురం టోల్గేట్ సమీపంలో లోకేశ్ బస చేయనున్నారు.
నాలుగోరోజు యువగళం పాదయాత్రలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారితో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ సామాజిక వర్గం కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మళ్లీ అధికారంలోకి రాగానే అండగా నిలుస్తామని వడ్డెర సామాజిక వర్గానికి భరోసా ఇచ్చారు. వడ్డెరలక రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా ప్రాధాన్యత గల పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ వర్గానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్న వారికి టీడీపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. 3 పూటల భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. మొత్తం 4 రోజులపాటు లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఈ యువనేత 4 వేల కిలోమీటర్లు నడవనున్నారు.