Hindenburg:భారతదేశ వృద్ధిని, ఇండియన్ కంపెనీల ప్రగతిని చూసి ఓర్వలేకే… హిండెన్బర్గ్, అదానీ గ్రూపుపై ఆరోపణలు చేసిందని… ఆ సంస్థ గట్టి కౌంటర్ ఇచ్చింది. అవన్నీ నిరాధారమైనవి, అబద్ధాలేనని 413 పేజీల వివరణ విడుదల చేసింది. తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయడం ద్వారా మార్కెట్లలో లాభాలు పొందాలనే కుట్రతోనే… షార్ట్ సెల్లింగ్ సంస్థ అయిన హిండెన్బర్గ్, అదానీ గ్రూపుపై నివేదిక విడుదల చేసిందని మండిపడింది. ఇది అదానీ గ్రూపు మీద చేసిన దాడి మాత్రమే కాదని… దేశం, దేశ స్వతంత్రత, సమైక్యత, దేశీయ సంస్థల ఆశయాలు, వృద్ధిపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా ఆ సంస్థ అభివర్ణించింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓకు ముందు ఈ నివేదికను విడుదల చేయడం చూస్తుంటే… హిండెన్బర్గ్ దురుద్దేశమేంటో ఇట్టే అర్థమవుతోందని అదానీ గ్రూప్ పేర్కొంది. తనకు నచ్చినట్టు తప్పుడు సమాచారాన్ని చేర్చి నివేదిక రూపొందించిందని… ఈ పరిణామం హిండెన్బర్గ్ విశ్వసనీయత, నైతికతపై అనుమానాలు రేకెత్తిస్తోందని వ్యాఖ్యానించింది. ఎలాంటి కారణాలు లేకుండా… ఎలాంటి పరిశోధన చేయకుండా హిండెన్బర్గ్ తమపై నివేదికను విడుదల చేసిందని… ఆ సంస్థ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో… 65 ప్రశ్నలకు ఇప్పటికే జవాబిచ్చామని అదానీ గ్రూప్ తెలిపింది. మిగతా 23లో 18 ప్రశ్నలు వాటాదారులు, థర్డ్ పార్టీలకు సంబంధించినవని, మిగతా 5 ప్రశ్నలు.. నిరాధార ఆరోపణలు అని వివరించింది. వాటిని తమ కంపెనీలు కూడా ఖండించాయని తెలిపింది.
చట్టాలు, నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటిస్తున్నామని అదానీ గ్రూప్ తెలిపింది. భాగస్వాముల ప్రయోజనాలను కాపాడుతూ… అత్యున్నత స్థాయి పాలనా ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే తమ లక్ష్యమని, రూ.20 వేల కోట్ల మలివిడత పబ్లిక్ ఆఫర్ విజయవంతమవుతుందని… అదానీ గ్రూపు ధీమా వ్యక్తం చేసింది. వేగంగా వృద్ధి చెందుతున్న అదానీ ఎంటర్ప్రైజెస్లో వాటాను సొంతం చేసుకునేందుకు ఇన్వెస్టర్లకు ఇది సువర్ణావకాశమని తెలిపింది.