Modi: BBC. అంతర్జాతీయంగా మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న సంస్థ. న్యూస్ ను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుందనే పేరు కూడా ఉంది. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా బీబీసీ అంటే తెలీని వారు ఉండరు. మీడియాలో అదో ఐకాన్.
అలాంటి బీబీసీ ఇప్పుడు ఇండియాలో తీవ్ర కాంట్రవర్సీ అవుతోంది. మోదీ హయాంలో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ తీసిన డాక్యుమెంట్ వివాదాస్పదంగా మారింది. ఎప్పుడో మానిన గాయాన్ని మళ్లీ గెలికారనే విమర్శలు వస్తున్నాయి. కావాలనే మోదీని నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేసిందంటూ బీబీసీపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. ఎంత సీరియస్ గా ఉందంటే.. ఇండియాలో బీబీసీ తీసిన డాక్యుమెంట్ ఆపేసేంతగా. అవును, కేంద్రం గట్టిగా చెప్పి సోషల్ మీడియాల నుంచి ఆ వీడియో లింకులు తీసేయించింది.
భారత్ లో బీబీసీ డాక్యుమెంట్ ప్లే కాకుండా కేంద్రం అడ్డుకోవడం.. ప్రజాస్వామ్య విలువలు, మీడియా హక్కులను హరించడమేనంటూ తాజాగా సుప్రీంకోర్టుకు ఎక్కారు కొందరు ప్రముఖులు. సుప్రీం సైతం విచారణకు అంగీకరించడంతో మరోసారి బీబీసీ మోదీ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.
2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లు, ఆ సమయంలో సీఎంగా ఉన్న మోదీని విమర్శిస్తూ.. బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఇండియాలో ప్రసారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్లు ఈ పిల్స్ ఫైల్ చేశారు. డాక్యుమెంటరీ చూసే ప్రజలను అరెస్టులు చేస్తున్నారని.. అందుకే పిల్లను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరారు. అయితే, అర్జెంట్ గా విచారించాల్సిన అవసరం లేదంటూ.. వచ్చే సోమవారం విచారిస్తామంటూ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును వారం పాటు వాయిదా వేసింది.
అటు.. బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్ పై సుప్రీంకోర్టులో పిల్ వేసిన వారిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు మండిపడ్డారు. ఇలాంటి పిటిషన్లు వేయడం సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని వృథా చేయడమే అన్నారు.