CID : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మంచి వాక్ చాతుర్యం ఉన్న నేత. ఆయన వైసీపీ సర్కార్ పై తొలి నుంచి ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆయన తనయుడు విజయ్ కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రీకొడుకులు ఇద్దరూ నేరుగా సీఎంనే టార్గెట్ చేస్తూ చాలాసార్లు వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. కొన్నాళ్ల క్రితం ప్రభుత్వం స్థలం కబ్జా చేశారంటూ అయ్యన్న ఇంటి ప్రహారీ గోడను కూల్చేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. ఈ వ్యవహారం తర్వాత అయ్యన్నపాత్రుడు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో మరో కేసులో ఏపీ ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది.
అయ్యన్న తనయుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ను సీఐడీ విచారణకు పిలిచింది. విజయ్ మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు ఆంక్షలు విధించారు. కార్యాలయానికి దూరంగానే టీడీపీ నాయకులను, కార్యకర్తలను నిలువరించారు. టీడీపీ నేతలను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
కేసు నేపథ్యం..
గతంలో భారతి పే పేరిట సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. విజయ్ పై ఐపీసీ 419, 469, 153(ఎ), 505(2), 120(బి), రెడ్ విత్ 34 సెక్షన్లతోపాటు ఐటీ చట్టంలో 66(సి) సెక్షన్లతో మంగళగిరిలోని సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో గతేడాది అక్టోబర్ 1న కేసు నమోదు చేశారు. ఈ కేసులో చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇటీవల నర్సీపట్నంలో నివాసానికి వెళ్లి విజయ్ తల్లి పద్మావతికి నోటీసులు అందించింది. ఈ కేసులో గతంలో హైదరాబాద్లో విజయ్ నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేరు.
హైదరాబాద్ లోని విజయ్ నివాసంలో చిన్నపిల్లలను, పనిమనిషిని భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపిస్తూ పోలీసుల వైఖరిపై విజయ్ తరఫున న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం సీఐడీ పోలీసుల తీరును తప్పుపట్టింది. విచారణ చేయాలనుకుంటే ముందుగా 41(ఎ) నోటీసు జారీచేసి వెళ్లాలని సూచించింది. దీంతో విజయ్పై చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు అదే కేసులో మళ్లీ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపుతోంది.