Rahul Gandi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభించిన ఈ యాత్ర కశ్మీర్ వరకు సాగింది. మొత్తం 134 రోజులపాటు 4,084 కిలోమీటర్లు రాహుల్ నడిచారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, జమ్మూకశ్మీర్ ల్లో యాత్ర సాగింది. మొత్తం 12 బహిరంగ సభలు నిర్వహించారు. 100కు పైగా కార్నర్ సమావేశాల్లో రాహుల్ ప్రసంగించారు. 13 మీడియా సమావేశాలు నిర్వహించారు. 275 చోట్ల నడుస్తూ, 100 చోట్ల కూర్చొని ఫేస్ టూ ఫేస్ లు నిర్వహించారు.
కేంద్రంపై టార్గెట్..
పాదయాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ .. బీజేపీ , ఆరెస్సెస్ పై ఘాటు విమర్శలు చేశారు. విద్వేషాలు వ్యాపించిన దేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా తాము ప్రేమ దుకాణాలు తెరిచామన్నారు. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఈ యాత్ర కొనసాగిందని స్పష్టం చేశారు. పార్లమెంట్ లోనూ, ఇతర వేదికలపై విపక్షాల గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని విమర్శించారు. ఎన్నికైన ప్రభుత్వాలను అక్రమ మార్గాల్లో నేలకూలుస్తున్నారని ఆరోపించారు. చైనా విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. జమ్మూ-కశ్మీర్లో పరిస్థితులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు. భద్రతా పరిస్థితులు మెరుగయ్యాయన్న కేంద్రం వాదనను తోసిపుచ్చారు. భద్రత మెరుగైతే.. జమ్మూ నుంచి లాల్చౌక్ వరకు బీజేపీ యాత్ర నిర్వహించాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ లో జోష్ వచ్చిందా..?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఊహించని విధంగా స్పందన లభించింది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు యాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామరాజన్ రాహుల్ తో కలిసి నడిచి పలు విషయాలు చర్చించారు. పేదవర్గాలతో రాహుల్ మమేకమవుతూ ముందుకుసాగారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో స్పష్టం చేశారు. పేదలకు భరోసా కల్పించడంలో రాహుల్ సక్సెస్ అయ్యారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాల వల్ల జరుగుతున్న నష్టాలను వివరిస్తూ ముందుకు సాగారు.
బీజేపీ నేతలు తన టీ షర్టుపైనా, తన అలవాట్లపైనా విమర్శలు గుప్పించినా రాహుల్ ఎంతో హుందాగా సమాధానం ఇచ్చారు. ఘాటుగా విమర్శలు చేయాల్సిన వచ్చిన సందర్భంలో వెనక్కితగ్గలేదు. దీంతో పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ మరింత పెరిగిందనడంలో సందేహం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. రాహుల్ గాంధీ నిర్వహించిన కార్నర్ సమావేశాలు, సభలకు వచ్చిన జనమే ఈ విషయాన్ని నిరూపించారు. రాహుల్ పాదయాత్ర చేసిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ ఏడాది పలురాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే విధంగా రాహుల్ గాంధీ ముందుకు సాగితే కాంగ్రెస్ మరింత బలపడటం ఖాయం. బీజేపీకి సవాల్ తప్పదు.