Tarakaratna Condition:నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. 48 గంటల అబ్జర్వేషన్ ముగిసింది. ప్రస్తుతం ఆయన
వెంటిలేటర్ పైనే శ్వాస తీసుకుంటున్నారు. వైద్యులు మరోసారి అన్ని పరీక్షలు పరీక్షలు చేయనున్నారు. సాయంత్రం రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని ప్రకటించారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేసిన తర్వాత పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సాయంత్రంలోపు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు.
తారకరత్నకు కుప్పంలో యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం చికిత్స కొనసాగిస్తోంది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ ఆదివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని తెలిపారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని వెల్లడించారు. నిమ్హాన్స్ న్యూరోసర్జన్ ప్రొఫెసర్ గిరీష్ కులకర్ణి నేతృత్వంలో ఇద్దరు న్యూరో సర్జన్లు తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయ, నిమ్హాన్స్ల నుంచి 10 మంది వైద్యులు ఆయన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
మరోవైపు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తల తాకిడి పెరిగింది. దీంతో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు అధికారులను బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రతాప్రెడ్డి ఆదేశించారు.