Government Vs Governor:తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య రోజుకో వివాదం తలెత్తుతోంది. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. గవర్నర్ సిఫారసుల కోసం రాజ్భవన్కు పంపించింది. కానీ గవర్నర్ తమిళిసై బడ్జెట్ కు ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో న్యాయపోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. పిటిషన్ అనుమతిస్తే పూర్తి వివరాలు చెబుతామని ప్రభుత్వ ఏజీ హైకోర్టుకు వివరించారు. చివరకు పిటిషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు.
సంప్రదాయం ప్రకారం గవర్నర్ ఆమోదం తర్వాతే బడ్జెట్ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. అనంతరం శాసనసభ, మండలిలో ప్రవేశపెడతారు. ముసాయిదా బడ్జెట్ ప్రతులను మూడురోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది. ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం తెలపలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో ఈ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాజ్భవన్లోనే ఉండిపోయాయి. తమిళిసై సోమవారం హైదరాబాద్కు వస్తున్నారని. ప్రతిపాదనలను ఆమోదించి ప్రభుత్వానికి తిరిగి పంపించే విషయంపై నిర్ణయం తీసుకుంటారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి.
గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీ. ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సాంకేతికంగా వెసులుబాటు ఉంది. దీనిని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది. తనను అవమానించడానికే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రసంగం లేకుండా చేస్తోందని రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిఫారసు చేశానని గతేడాది గవర్నర్ చెప్పారు. అవసరమైతే సిఫారసు చేయకుండా పెండింగ్లో ఉంచగలనని కూడా అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింత తీవ్రమైన నేపథ్యంలో..బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపకుండా పెండింగ్లో ఉంచడంతో ఈ వివాదం ఏర్పడింది.