IND Vs NZ : టార్గెట్ 100 పరుగులే. కానీ చివరి ఓవర్ వరకు ఫలితం తేలలేదు. లక్నోలో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ మరోసారి విఫలమై 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ( 19 పరుగులు) క్రీజులో నిలబడేందుకు ప్రయత్నించినా అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఆ వెంటనే రాహుల్ త్రిపాఠి ( 13 పరుగులు) ఔట్ కావడంతో టీమిండియా 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన సుందర్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ కివీస్ బౌలర్లను అడ్డుకున్నాడు.
అయితే సుందర్ కూడా రనౌట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అప్పటి భారత్ స్కోర్ 70 పరుగులు . విజయానికి 33 బంతుల్లో 30 పరుగులు చేయాలి. సాధారణ పిచ్ పై అయితే ఈ స్కోర్ లెక్కేకాదు. కానీ లక్నో పిచ్ బౌలర్లకు పూర్తిగా సహకరించడంతో బ్యాటర్లు పరుగులు చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సింగిల్ తీయడమే గగనమైంది. ఈ సమయంలో కెప్టెన్ హార్థిక్ పాండ్యా , సూర్య కుమార్ యాదవ్ సింగిల్స్ తీసుకుంటూ జట్టును విజయం వైపు నడించారు. చివరి ఓవర్ ఐదో బంతికి సూర్యకుమార్ యాదవ్ బౌండరీ కొట్టి భారత్ కు విజయాన్ని అందించాడు. 31 బంతులు ఆడిన సూర్య 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20ల్లో విధ్వంసకర బ్యాటరైన సూర్య తాను ఎదుర్కొన్న 31వ బంతికి తొలి బౌండరీ కొట్టాడంటే పిచ్ ఎంత కఠినంగా ఉందో అర్థమవుతోంది. కెప్టెన్ హార్థిక్ పాండ్యా 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. కివీస్ బౌలర్లలో బ్రాస్ వెల్ , ఇష్ సోధి చెరో వికెట్ తీశారు. ఆ జట్టు 17 ఓవర్లు స్పిన్నర్లతోనే వేయించింది.
అంతకుముందు న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండటంతో భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. తొలి 10 ఓవర్లలో 50 పరుగులే ఇచ్చి నలుగురు కివీస్ బ్యాటర్లను పెవిలియన్ కు చేర్చారు. ముఖ్యంగా స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, చాహల్, దీపక్ హుడా , కులదీప్ యాదవ్ తలో వికెట్ తీసి కివీస్ రెక్కలు విరిచారు. గత మ్యాచ్ లో ఘోరంగా విఫలమైన అర్ష్ దీప్ సింగ్ మళ్లీ గాడిలో పడ్డాడు. ఈ మ్యాచ్ లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 2 వికెట్లు పడగొట్టాడు.కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన 19 పరుగులే అత్యధికం. ఏ బ్యాటర్ కూడా కనీసం 15 పరుగులు చేయలేకపోయాడు. దీంతో 20 ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులు మాత్రమే చేయగలిగింది.
క్రీజులో చివరి వరకు నిలిచి భారత్ కు విజయాన్ని అందించిన సూర్యకుమార్ యాదవ్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ 20 అహ్మదాబాద్ లో జరగనుంది.