ఇప్పటికే చంద్రుడిపైకి ఎన్నో శాటిలైట్లు వెళ్లాయి. అక్కడ ఎన్నో వందల పరిశోధనలు జరిగాయి. ఇక ఈ ఏడాదిలో చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేయాలని ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే చైనా అందరికంటే ముందుండాలనే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర దేశాలను వెనక్కి తోసి చైనా చంద్రుడిపై కొత్త అభివృద్ధి చేయనున్నట్టు సమాచారం.
ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీలో, స్పేస్ రీసెర్చ్లో చైనా ఇతర దేశాలతో పోటీపడుతూ దూసుకుపోతోంది. ఇక చంద్రుడిపై వనరుల ఎక్కువగా ఉన్న ప్రాంతంలో తమ జెండా ఎగురవేయాలని చైనా ఆలోచిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాంటి ప్రాంతాల్లో ముందుగా తమ శాటిలైట్లను దింపి అవి తమ స్థానాలుగా నిలిపుకోవాలని చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. చైనా అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తే త్వరలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి వెళుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
10 ట్రిలియన్ డాలర్ల ఖర్చుతో ఒక ఎకనామిక్ జోన్ను ఏర్పాటు చేస్తామని చైనా ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే సైన్స్ అండ్ టెక్నాలజీని, స్పేస్ రీసెర్చ్ను బలపరుస్తూ ముందుకెళ్తోంది. గతేడాది చైనా ఓ స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. అది భూమి చుట్టూ తిరుగుతూనే చంద్రుడిపై ఎన్నో పరిశోధనలు చేసింది. ఇక త్వరలోనే చంద్రుడి సౌత్ పోల్ దగ్గర ఒక ఆటోనామస్ ల్యూనార్ రీసెర్చ్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని బీజింగ్ ఆలోచిస్తుందని సమాచారం.
అంతరిక్షంలో పరిశోధనలు చేయడంతో పాటు ఇతర దేశాలకంటే ఎక్కువగా అక్కడ పట్టు సాధించాలని చైనా సన్నాహాలు చేస్తోంది. అమెరికాకంటే చైనానే అంతరిక్షంలో చోటును ఆక్రమించుకునే అవకాశాలు చాలానే ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దానికి తగినట్టుగా చైనా పలు స్పేస్క్రాఫ్ట్స్ కూడా తయారు చేసి అంతరిక్షంలోకి పంపించనుంది. 2023లో 60 స్పేష్ మిషిన్లతో దాదాపు 200 స్పేస్క్రాఫ్ట్స్ను అంతరిక్షంలోకి పంపించడానికి చైనా సిద్ధంగా ఉంది.
చంద్రుడిపై, మార్స్పై స్థావరాలు ఏర్పాటు చేయడం కష్టమైన విషయమే అయినా చైనా, రష్యా వంటి దేశాల వద్ద కొన్ని అదునాతనమైన శాటిలైట్లు ఉన్నాయి. వాటి ద్వారా అది సులభంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చైనా స్పేస్ కలలను ఎదుర్కోవడానికి అమెరికా ఇప్పటికే స్పేస్ ఫోర్స్ అనే విభాగాన్ని 2019లో ఏర్పాటు చేసింది. మరి ఇతర దేశాల వ్యూహాలు చైనాపై ఏ మాత్రం పనిచేస్తాయో చూడాలి