పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతున్న ధరల కారణంగా… గత మూడు నెలలుగా దేశంలో బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి. అంతర్జాతీయ పరిణామాలకు తగ్గట్లుగా బంగారం ధరలు మారుతున్నా… పసిడి దిగుమతులపై వివిధ సుంకాలు ఏకంగా 15 శాతం ఉండటంతో… ఆ భారాన్ని వినియోగదారులే మోయాల్సి వస్తోంది. దాంతో… వచ్చే బడ్జెట్లో అయినా బంగారం ధరలపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే, పసిడి కొనుగోళ్లు పెరుగుతాయేమోనని… గోల్డ్ వ్యాపారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
బంగారం దిగుమతులపై ప్రస్తుతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్ 2.5 శాతం కలిపి… మొత్తం 15 శాతం సుంకం వసూలు చేస్తున్నారు. కరెంట్ ఖాతా లోటును తగ్గించేందుకు గత బడ్జెట్లో దిగుమతి సుంకాల్ని పెంచారు. దాంతో… 2021లో 1,068 టన్నులుగా ఉన్న బంగారం దిగుమతులు… 2022లో 706 టన్నులకు తగ్గిపోయాయి. దిగుమతి సుంకం పెంపు వల్ల దేశంలోకి బంగారం అక్రమ రవాణా పెరిగిందనీ, ఏటా దాదాపు 200 టన్నుల బంగారం దేశంలోకి అక్రమంగా వస్తోందని… దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందని… పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పన్నులు తగ్గిస్తే అక్రమరవాణా తగ్గి, దిగుమతులు పెరిగి.. ఆ మేరకు పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయని చెబుతున్నాయి.
బంగారం, వెండి, ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్-జీజేఈపీసీ డిమాండ్ చేస్తోంది. రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించి బంగారంతో పాటు మరికొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సూచించింది. అలా చేస్తే దేశం నుంచి ఆభరణాలు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయని వ్యాఖ్యానించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం అనేక రంగాలకు పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించడంతో… దిగుమతి సుంకాలు తగ్గిస్తే… ఆభరణాల తయారీతో పాటు ఎగుమతులు కూడా పెరుగుతాయని గోల్డ్ వ్యాపారులు భావిస్తున్నారు.