Taraka Ratna: నందమూరి తారకరత్న పరిస్థితి నిలకడగా ఉందని బాలకృష్ణ తెలిపారు. బెంగళూరు నుంచి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయనకు స్టంట్ వేయడం కుదరదని.. తిరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని వివరించారు. తారకరత్న కోసం వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని వెల్లడించారు.
తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తారకరత్న పోరాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. క్రిటికల్ కండీషన్ నుంచి బయటపడ్డారని చెప్పలేం అని అన్నారు.
కాగా, నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చేర్పించి… శుక్రవారం అర్ధరాత్రి వరకూ చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఐసీసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్న వెంట సతీమణి అలేఖ్యరెడ్డి, బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నారు.