Adani: తెలంగాణలో వరుసబెట్టి సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీల కంపెనీలతో పాటు పలు ప్రైవేట్ సంస్థలపైనా రెగ్యులర్ గా సోదాలతో హడావుడి చేస్తున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థలు. ఆ తనిఖీల్లో పెద్దగా పట్టుబడిందేమీ ఉండట్లే. కేవలం రాజకీయ బెదిరింపుల కోసమే ఈ దాడులనేది బీఆర్ఎస్ విమర్శ.
అదంతా సరే, మరి దేశాన్ని కుదిపేస్తున్న అదానీ కంపెనీ అక్రమాలపై సీబీఐ, ఐటీ, ఈడీ ఇంకా రియాక్ట్ కావట్లేదు ఎందుకు? హిండెన్ బెర్గ్ ఆధారాలతో సహా నివేదిక ఇస్తే.. జాతీయ దర్యాప్తు సంస్థలేవీ ఇంకా రంగంలోకి దిగడం లేదు ఎందుకని? స్టాక్ మార్కెట్లు కుప్పకూలి మదుపర్ల 4 లక్షల కోట్ల సంపద ఆవిరి అయినందుకైనా.. కనీసం సెబీ, ఆర్బీఐ అయినా విచారణ చేస్తుందా అనే అనుమానం.
అదానీకి మోదీ సర్కారు కొమ్ముకాస్తోందంటూ విపక్షాలు మొదటినుంచీ ఆరోపిస్తూనే ఉన్నాయి.
మోడీ అధికారంలోకి వచ్చాక అదానీ సంపద అంతకంతకూ పెరిగిపోతూ వస్తోందని అన్నారు. ఏకంగా ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి అదానీ ఎదిగారంటే అది మోదీ చలువే అని విమర్శిస్తుంటారు.
ఇటీవల శ్రీలంకలోని ఓ విద్యుత్ ప్రాజెక్టు, ఆస్ట్రేలియా బొగ్గు గనులను కైవసం చేసుకునేందుకు అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చేందుకు ఎస్బీఐ పై కేంద్రం ఒత్తిడి తీసుకువచ్చిందనే ఆరోపణ ఉంది. అదానీ కంపెనీలలో ఎల్ఐసీ ద్వారా రూ. 81 వేల కోట్ల పెట్టుబడి పెట్టించారని కూడా అంటున్నారు. ఎన్డీటీవీ లాంటి బీజేపీ వ్యతిరేక జాతీయ మీడియాను అదానీ కంపెనీతో బలవంతంగా టేకోవర్ చేయించారనే విమర్శ ఉండనే ఉంది. ఇలా అదానీ పాపాల పుట్టలో కేంద్ర బీజేపీ పాత్ర ఎంతో ఉందంటూ ప్రతిపక్షాలన్నీ మండిపడుతున్నాయి.
బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లో చీటికీ మాటికీ సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జరుగుతుంటే.. అదానీ కంపెనీలపై ఇంతపెద్ద ఎత్తున ఫ్రాడ్ ఆరోపణలు వచ్చాక కూడా ఇంకా జాతీయ దర్యాప్తు సంస్థల్లో కదలిక రావడం లేదు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అదానీ గుజరాతీ అనా? మోదీకి మంచి మిత్రుడనా? అంటూ నిలదీస్తున్నాయి విపక్షాలు.