Taraka Ratna: ఏమాత్రం బెటర్ మెంట్ లేదు. రెండు రోజులుగా అదే పరిస్థితి. తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రికి షిఫ్ట్ చేసినా.. ఆయన ఆరోగ్యం అసలేమాత్రం మెరుగు అవడం లేదు. ఎందుకంటే.. ఆయన గుండెలో బ్లాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయట. ఎడమవైపు ఏకంగా 90 శాతం వాల్వ్స్ పూడుకుపోయాయని చెబుతున్నారు వైద్యులు. గుండె పనితీరు సరిగా లేకపోవడంతో.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా బ్లడ్ పంపింగ్ చేస్తున్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. సోమవారం మరిన్ని కీలక పరీక్షలు చేస్తామని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు.
తారకరత్నను చూసేందుకు నందమూరి కుటుంబం బెంగళూరు వెళ్లింది. తండ్రి మోహనకృష్ణ, బాలకృష్ణ, పురంధేశ్వరి, నందమూరి సుహాసిని, చైతన్య కృష్ణ తదితరులు హాస్పిటల్ లోనే ఉన్నారు. తారకరత్న కోమాలో ఉన్నారని చైతన్య కృష్ణ చెప్పారు.
చంద్రబాబు సైతం బెంగళూరు వెళ్లారు. నారాయణ హృదయాలయ వైద్యులతో మాట్లాడారు. తారకరత్నకు అందిస్తున్న చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐసీయూలో మెరుగైన చికిత్స అందిస్తున్నారని.. గుండెలో బ్లాక్స్ ఎక్కువగా ఉండటంతో కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారని చంద్రబాబు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఆదివారం బెంగళూరు వెళ్లనున్నారు.
దేవినేని ఉమా, చినరాజప్ప, పరిటాల శ్రీరామ్ తదితర టీడీపీ నేతలతో పాటు పెద్ద సంఖ్యలో నందమూరి అభిమానులు తరలి వచ్చారు. హాస్పిటల్ దగ్గర పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.