AvinashReddy: ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ఉత్కంఠ రేపింది. సాక్షిగా పిలిచారా? నిందితుడిగా రమ్మన్నారా? అంటూ ఊహాగానాలు వచ్చాయి. చివరాఖరికి సాక్షిగానే పిలిచారని తెలిసింది. హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో 4 గంటల పాటు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు.
కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు, నిందితుడు దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగా ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి పలు వివరాలు రాబట్టింది. వివేకా హత్య సమయంలో ఎక్కడ ఉన్నారు? డెడ్ బాడీని ఎప్పుడు చూశారు? చూడగానే ఏం చేశారు? గుండెపోటు అని ఎందుకు చెప్పారు? వివేకాతో ఎలాంటి సంబంధం ఉండేది? దస్తగిరి తెలుసా? నిందితులు మీ పేరును ఎందుకు ప్రస్తావించారు? ఇలా రకరకాల ప్రశ్నలతో అవినాశ్ రెడ్డి నుంచి సమాచారం సేకరించారని తెలుస్తోంది.
విచారణ ముగిశాక ఎంపీ అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీబీఐ అడిగిన వివరాలు చెప్పానని.. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన సమాచారం ఇచ్చానని అన్నారు. అవసరమైతే మళ్లీ పిలుస్తాం అన్నారని.. ఎప్పుడు పిలిచినా సీబీఐకి సహకరిస్తానని అవినాశ్ రెడ్డి చెప్పారు.
అంతకుముందు, విచారణలో తనతో పాటు లాయర్లను అనుమతించాలని.. ఎంక్వైరీని వీడియో, ఆడియో రికార్డ్ చేయాలంటూ సీబీఐకి లేఖ రాశారు అవినాశ్ రెడ్డి. అయితే, అలా కుదరదని.. అందుకు అనుమతించలేమని సీబీఐ అధికారులు తేల్చి చెప్పడంతో అవినాశ్ రెడ్డిని సింగిల్ గానే ప్రశ్నించారు సీబీఐ ఆఫీసర్స్.