YSRCP: తెలంగాణతో పోల్చితే ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయి. గొడవలు, హత్యలతో రచ్చ రచ్చగా నడుస్తుంటాయి. ఇటీవలి మాచర్లలో టీడీపీ వర్సెస్ వైసీపీ పొలిటికల్ ఫైట్.. ఓ రేంజ్ లో సాగింది. అట్లుంటది ఏపీలో.
ఎప్పుడూ టీడీపీ, జనసేనపైనేనా దాడులు.. ఓసారి తమలో తాము కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నట్టున్నారు వైసీపీ శ్రేణులు. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే సాక్షిగా ఇరువర్గాలు తీవ్రంగా కొట్టుకున్నాయి.
నాగాయలంకలో నాబార్డు ఛైర్మన్ పర్యటనలో పాల్గొనేందుకు ఎంపీ బాలశౌరితో పాటు ఆయన అనుచరులు వచ్చారు. ఆ సమయానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు తన వర్గంతో అక్కడే ఉన్నారు. ఇరు పక్షాలకు ఎవరంటే ఒకరికి పడదు. ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు ఎదురుపడగానే.. కంట్రోల్ తప్పారు. పరస్పరం చితక్కొట్టుకున్నారు. చెప్పులతో దాడి చేసుకున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారినీ లెక్కచేయలేదు. ఆ గొడవను షూట్ చేస్తున్న ఓ జర్నలిస్టు ఫోన్ను లాక్కొని పగలగొట్టారు. ఒక దశలో ఎమ్మెల్యే రమేష్బాబుపై కూడా ఎంపీ వర్గీయులు దాడి చేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఇటీవల సీఎం జగన్ అవనిగడ్డ పర్యటనకు వచ్చినప్పుడు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వర్గీయుల మధ్య ఫ్లెక్సీల విషయంలో వివాదం ఏర్పడింది. అది మనసులో ఉంచుకుని.. దొరికిందే ఛాన్స్ అంటూ నాగాయలంకలో బాహాబాహీకి దిగారు. అంతా వైసీపీ కార్యకర్తలే కావడంతో పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేస్తారో?