Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ ప్రెస్. దేశమెంతో గర్విస్తోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. విమాన ప్రయాణం తరహాలో రైల్ జర్నీ. తక్కువ ఖర్చుతో సెమీ హైస్పీడ్ రైలు బండి. ఘనంగా ప్రారంభిస్తున్నారు ప్రధాని మోదీ. లోపల వసతుల గురించి గొప్పగా ప్రచారం జరుగుతోంది. ఇలా, వందే భారత్ కు అంతా జై కొడుతున్న వేళ.. కొందరి చేష్టలు భారత్ పరువు తీసేలా కనిపిస్తున్నాయి.
పై ఫోటో చూశారుగా. ఇది వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో తీసిందే. రైల్లో ప్లాస్టిక్ కవర్లు, ఫుడ్ వేస్టేజ్, రకరకాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. వాటిని ఊడ్చితే కుప్పగా పోగుపడ్డాయన్నీ. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వందే భారత్ ను మనోళ్లు చెత్తా చెదారంతో చెత్త భారత్ గా మార్చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
క్లీన్ నెస్ ను పాటించాలనే ఇంగితం కూడా లేదా? అంటూ కొందరు యూజర్లు కామెంట్లు పెడుతుంటే.. అవన్నీ ట్రైన్లో అమ్మింది రైల్వే శాఖనే కదా? వాటిని అక్కడే వదిలేయకుండా ఇంటికి తెచ్చుకుంటారా? అంటూ మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు. అంతా దిగిపోయాక ఆ మాత్రమైనా వేస్టేజ్ ఉండదా? ఇంకొకరి కామెంట్. ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలనేది చాలా మంది డిమాండ్.
మామూలు రైళ్లలో ఇలాంటి సీన్లు కామన్. పల్లి పొట్టు నుంచి వక్కపొడి ప్యాకెట్ల వరకూ.. డస్ట్ బిన్ లానే ఉంటాయి మన ఇండియన్ రైల్వేస్. వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ అయ్యే సరికి చెత్తా చెదారం అంటూ అందరికీ బాధ్యత గుర్తుకొస్తోందంటూ ఇంకొందరి ఆగ్రహం. ఇలా ఈ ఒక్క ఫోటో రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.