KTR: సీఎం కేసీఆరేమో ఈసారి ముందస్తు ఉండదని పదే పదే చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అంటున్నారు. మంత్రి కేటీఆరేమో ముందస్తు ఎన్నికలకు రెడీ అంటూ సవాల్ విసురుతున్నారు. తండ్రి అలా.. కొడుకు ఇలా.. ఎందుకలా?
తెలంగాణ రాజకీయం ఓ పట్టాన అంతుచిక్కడం లేదు. గులాబీ బాస్ ఎన్నికలకు వేగంగా సిద్ధమవుతున్నారు. కంటి వెలుగు, కొత్త సచివాలయం, పెద్ద ఎత్తున ఐపీఎస్ ల బదిలీలు, టీచర్ల ట్రాన్స్ ఫర్స్ అండ్ ప్రమోషన్స్, అమరవీరుల స్మారకం.. ఇలా వడివడి అడుగులతో ఎన్నికల వేడి రగిలిస్తున్నారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న హడావుడి చూస్తుంటే.. ఈసారి కూడా ముందస్తు పక్కా అనే అనుమానం కలుగుతోందని అంటున్నారు. ఆ ప్రచారానికి మరింత బలం చేకూరేలా.. లేటెస్ట్ గా మంత్రి కేటీఆర్ సైతం ముందస్తు ఎన్నికలకు మేం రెడీ అంటూ నిజామాబాద్ వేదికగా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి రండి. మేం అసెంబ్లీ రద్దు చేస్తాం. ముందస్తు ఎన్నికలకు అందరం కలిసే పోదాం.. అంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సవాల్ విసిరారు కేటీఆర్. తెలంగాణ నుంచి కేంద్ర రూపాయి తీసుకుని.. తిరిగి రాష్ట్రానికి కేవలం 46 పైసలే ఇస్తోందని.. తాను చెప్పిన ఈ లెక్క తప్పు అయితే రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఈ సారైనా తెలంగాణకు చోటు దక్కుతుందా అని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని మండిపడ్డారు.
కేటీఆర్ ఇంతగా రెచ్చగొడుతున్నారంటే.. బీఆర్ఎస్ ముందస్తుకు బాగానే సిద్ధమైందని అంటున్నారు. అధికారంలో ఉంది కాబట్టి ముందస్తు ఏర్పాట్ల అడ్వాంటేజ్ ఎలానూ ఉంటుంది. మరి, ప్రతిపక్షాల సంగతేంటి? బీజేపీ ఇంకా మిషన్ 90 మీటింగ్స్ స్థాయిలోనే ఉంది. వలసలపై బాగా నమ్మకం పెట్టుకున్నా.. కొత్తగా కాషాయ కండువా కప్పుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఆ ప్రెజర్ లో ఈటల రాజేందర్ కోవర్టులంటూ మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇప్పటికిప్పుడు ముందస్తు వస్తే.. బీజేపీ ఏ మేరకు సన్నద్ధం?
అటు, కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలైతేనైనా హస్తం పార్టీలో కాస్త జోష్ పెరగొచ్చు. ఇలాంటి సమయంలో ఎర్లీ ఎలక్షన్ బెల్ మోగితే.. కాంగ్రెస్ కు కంగారే అంటున్నారు.
అందుకే, సమయం లేదు మిత్రమా.. ముందస్తు ఎప్పుడైనా రావొచ్చంటూ అన్నిపార్టీలను అలర్ట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.