AvinashReddy: ఎట్టకేళకు సీబీఐ విచారణకు హాజరయ్యారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వివేకా హత్య కేసు నాలుగేళ్లుగా అటూఇటూఎటో తిరిగి.. చివరాఖరికి అవినాష్ రెడ్డి విచారణ వరకూ వచ్చింది. వివేకా మర్డర్ కేసులో మొదటి నుంచీ ప్రతిపక్షాలన్నీ ఆయన్నే దోషిగా చూపిస్తున్నాయి. అవినాష్, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలే ఈ హత్య చేయించి ఉంటారంటూ ఆరోపించాయి. సీఎం జగన్ మాత్రం మొదటినుంచీ తమ్ముడిని వెనకేసుకు వస్తున్నారు. ఒక కన్ను మరో కన్నును పొడుస్తుందా? అంటూ అసెంబ్లీలోనే సమర్థించారు.
వివేకాను చంపిందెవరో ఇప్పటికీ తేలకున్నా.. ఆ రోజు హత్య అప్ డేట్స్ ఇచ్చిన ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద అవినాష్కు సీబీఐ నోటీసు జారీ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి భారీ పరివారం వెంటరాగా.. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు వచ్చారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. కాల్ డేలా, బ్యాంక్ లావాదేవీలపై సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్నారు. నిందితుడు దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు.
అంతకుముందు.. వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలని.. విచారణను రికార్డు చేసేందుకు అనుమతించాలని.. తనతో న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలంటూ లేఖలో సీబీఐని కోరారు ఎంపీ అవినాష్ రెడ్డి.
మరోవైపు, వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్, దస్తగిరి, శివశంకర్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు రావాలని ఆదేశించింది.
2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. బాత్ రూమ్ లో ఆయన్ను దారుణంగా నరికి చంపారు దుండగులు. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించింది. వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఆ వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలతో ఇప్పుడు ఎంపీ అవినాష్రెడ్డిని విచారిస్తోంది సీబీఐ.