Karnataka : ఆ స్వామీ జీ ఏకంగా సీఎంకే షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి పక్కనే కూర్చుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామంతో ఆ ముఖ్యమంత్రి షాక్ తిన్నారు. వెంటనే స్వామీ జీ చేతిలోంచి మైకు లాక్కున్నారు. ఈ ఘటన కర్నాటకలో జరిగింది. స్వామీజీ నుంచి సీఎం మైకును లాక్కుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
కర్నాటకలోని మహదేవపురలో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం బసవ రాజ్ బొమ్మై పాల్గొన్నారు. కాగినేలె మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరనందపురి స్వామీజీ ఈ సభకు హాజరయ్యారు. సీఎం పక్కనే కూర్చుని మైక్ అందుకున్న స్వామిజీ బెంగళూరులో సరైన మౌలికసదుపాయాలు లేవని విమర్శలు చేశారు. నగరవాసులు అవస్థలు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. బెంగళూరులో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కేవలం వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇక్కడకు వస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు పడుతున్నప్పుడు ప్రజలు ఇబ్బందులకు గురవకుండా ఏం చేయాలో అధికారులకు తెలియదా? అని ప్రశ్నించారు. సీఎం గతంలో హామీలు ఇచ్చారని అంటూ నేరుగా బొమ్మైనే టార్గెట్ చేశారు.
స్వామీజీ మాటలతో ముఖ్యమంత్రి బొమ్మై తీవ్ర అసహనానికి గురయ్యారు. స్వామీజీ మాట్లాడుతుండగానే మైకును లాగేసుకున్నారు. కేవలం హామీలు ఇచ్చి మర్చిపోయే ముఖ్యమంత్రిని తాను కాదని స్పష్టం చేశారు. బెంగళూరు అభివృద్ధికి నిధులు కూడా కేటాయించామని వివరించారు. పనులు కూడా జరుగుతున్నాయని విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. బీజేపీకి అనుకూలంగా ఉండే స్వామి జీ ఇలా ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై చర్చ జరుగుతోంది.