Adani: సేల్.. సేల్.. సేల్. ఉదయం 9:15కి స్టాక్ మార్కెట్లు ఓపెన్ అవడమే ఆలస్యం. అదానీ గ్రూప్ స్టాక్స్ లో భారీ సెల్లింగ్ జరిగింది. రోజంతా షేర్ వ్యాల్యూ అలా టపీ టపీమంటూ పడిపోతూనే ఉంది. మధ్యలో కాసేపైనా ఆగిందేలే. లోయర్ సర్క్యూట్ మాత్రమే అదానీ షేర్ల పతనానికి అడ్డుకట్ట వేయగలిగింది. లెక్కేస్తే.. అదానీ గ్రూపునకు చెందిన 10 షేర్లలో.. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 4 లక్షల కోట్లు ఆవిరైంది. ఈ భారీ డ్యామేజీకి కారణం.. హిండెన్ బర్గ్ రిపోర్ట్.
పెరుగుట విరుగుట కొరకే అనే డైలాగ్ అదానీ విషయంలో 100శాతం రుజువైంది. గడిచిన కొన్ని నెలలుగా పెరగడమే కానీ.. పడటమే కనిపించలేదు అదానీ స్టాక్స్ లో. దాదాపు అన్ని స్టాక్స్ ఆల్ టైమ్ హై ని టచ్ చేస్తూ వచ్చాయి. హిండెన్ బర్గ్ నివేదికతో వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో భారీగా పతనం కావడం కంపెనీని కలవర పెడుతోంది. బుధవారం లక్ష కోట్లు.. గురువారం మార్కెట్లకు సెలవు.. శుక్రవారం మరో 4 లక్షల కోట్లు నష్టపోయారు షేర్ హోల్డర్స్. అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 20 శాతానికి పైగా నష్టపోయాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ నష్టం 18 శాతం దగ్గర ఆగింది. ఇక, ఇటీవలే అదానీ గ్రూప్లో చేరిన ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్ షేర్లు సైతం దారుణంగా పతనమయ్యాయి.
షేర్ల విలువలు పెంచడంలో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందని, షేర్లు తాకట్టు పెట్టి అప్పుల మీద అప్పులు చేస్తోందని.. అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ 32 వేల పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. తమ షేర్ల విలువలపై ప్రతికూల ప్రభావం పడేలా, నివేదికలోని అంశాలను రూపొందించారని మండిపడింది. ఇన్వెస్టర్లను, అదానీ గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఒక విదేశీ సంస్థ చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం ఇదని అభ్యంతరం తెలిపింది. భారత, అమెరికా చట్టాల ప్రకారం హిండెన్బర్గ్పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే, తమ దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయని.. ఎలాంటి కేసులనైనా ఫేస్ చేస్తామని తెలిపింది హిండెన్బర్గ్.
మరోవైపు, అదానీ గ్రూపుపై వస్తోన్న ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున.. సెబీ, ఆర్బీఐలు విచారణ జరపాలని కోరింది.