T20 World Cup : భారత్ అమ్మాయిలు అదరగొట్టారు. అండర్ -19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లోకి దూసుకెళ్లారు. సెమీస్ లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. 108 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ షఫాలీ వర్మ 10 పరుగులకే వెనుదిరిగినా.. మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ చెలరేగి ఆడింది. 45 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. సౌమ్యా తివారీ 22 పరుగులు చేసి శ్వేతాకు సహకారం అందించింది. తివారీ అవుటైనా గొంగడి త్రిష (5 పరుగులు)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించింది శ్వేతా సెహ్రావత్.
న్యూజిలాండ్ బౌలర్లలో అన్నా బ్రౌనింగ్ మాత్రమే రెండు వికెట్లు పడగొట్టింది. మిగతా బౌలర్లు భారత్ అమ్మాయిలపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. దీంతో భారత్ సునాయాసంగా విజయం సాదించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఆ జట్టులో జార్జియా ప్లిమ్మెర్ (35), ఇసబెల్లా గాజె (26) మాత్రమే కాస్త మెరుగ్గా ఆడారు. కివీస్ జట్టులో ఆరుగురు బ్యాటర్లు 4 పరుగుల లోపే అవుటయ్యారు. భారత్ అమ్మాయిలు అంతకట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
భారత్ బౌలర్లలో పర్షవి చోప్రా 3 వికెట్లు పడగొట్టింది. సాధు, మన్నత్ క్యాశప్, షఫాలీ వర్మ, అర్చనా దేవి తలో వికెట్ తీశారు. 3 వికెట్లు తీసిన పర్షవి చోప్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ జట్లు రెండో సెమీస్ లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో ఆదివారం ఫైనల్ లో భారత్ తలపడుతుంది.