Yuvagalam: నారా లోకేశ్ పాదయాత్ర. యువగళం పేరుతో 400 రోజుల పాటు యాత్ర. ఏకంగా 4000 కిలోమీటర్ల ప్రయాణం. కుప్పం టు ఇచ్చాపురం. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచీ ఒకటే డౌట్. యువగళానికి లోకేశ్ సిద్ధమవుతున్నా.. ఆయన్ను సజావుగా యాత్ర చేయనిస్తారా? అనే అనుమానం. ఎందుకంటే, టీడీపీ అధినేత చంద్రబాబుపైనే రాళ్లు వేసిన ఘటనలు ఉన్నాయి. చంద్రబాబును కుప్పంలోనే అడ్డుకున్న పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి హార్డ్ కోర్ పాలిటిక్స్ నడిచే ఏపీలో.. లోకేశ్ ను అంతదూరం పాదయాత్ర చేయనిస్తారా? మధ్యలో వైసీపీ శ్రేణులు ఆటంకాలు కలిగిస్తారా? అనే అనుమానం అందరిలోనూ. టీడీపీలోనూ.
అందుకే, ఎందుకైనా మంచిదని యువగళం కోసం సొంతంగా భారీ స్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేసుకుంది టీడీపీ. ఏకంగా 200 మందిని లోకేశ్ వ్యక్తిగత భద్రత కోసం నియమించుకున్నారు. 400 రోజుల పాటు యాత్రలో అలర్ట్ గా ఉండేలా.. 400 మంది చురుకైన వాలంటీర్లు నిత్యం లోకేశ్ వెంటే కొనసాగనున్నారు.
ఏపీలోని పలు జిల్లాలకు చెందిన క్రియాశీలక కార్యకర్తలను గుర్తించిన టీడీపీ.. వారిని యువగళం వాలంటీర్లుగా నియమించింది. వారి కోసం లోకేశ్ బస చేసే ప్రాంతంలో ప్రత్యేకంగా జర్మన్ షెడ్లు వేసి వసతి కల్పిస్తుంది. భోజనాలు కూడా అక్కడే.
పాదయాత్ర జరిగే 400 రోజులూ కాన్వాయ్లోనే లోకేశ్ విశ్రాంతి తీసుకుంటారు. ఆ పక్కనే వాలంటీర్ల బస ఉంటుంది. ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా, దాడులకు దిగినా, సడెన్ గా జరగరానిదేమైనా జరిగినా.. వెంటనే ఆ వాలంటీర్లు స్పందించేలా ఈ ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇలా మందిమార్బలంతో నారా లోకేశ్.. 400 రోజుల పాటు, 4000 కిలోమీటర్లు దూరం.. 400 మంది వాలంటీర్లు.. 200 మంది సెక్యూరిటీతో.. యువరాజు కదిలే… అన్నట్టుగా యువగళం కొనసాగనుంది.