Ratha Saptami:సూర్య జయంతి సందర్భంగా ఈనెల 28న తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. రథసప్తమి సందర్భంగా పలు సేవలను రద్దు చేస్తున్నామని వేళ టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి చెప్పారు.. రథసప్తమి వేడుకలను ప్రతి ఒక్కరూ తమ విధులను మరింత అంకితభావంతో నిర్వహించాలని ఉద్యోగులకు, సిబ్బందికి ఆదేశించారు.
ఈనెల 28న టైంస్లాట్ టోకెన్లు రద్దు
రథసప్తమి రోజున శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి పురస్కరించుకుని 28న తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దుచేశారు. భక్తులు ఆ రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని తెలిపారు. వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు ,దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు..
ముందస్తు బుకింగ్ లు రద్దు
27, 28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్ రద్దు చేశామని, వసతి కేటాయింపు కోసం ఈ రెండు రోజుల్లో సీఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి.. రోజువారీ 3.5 లక్షల లడ్డూల తయారీతో పాటు 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా ఉంచుతారని తెలిపారు. తిరుమలలోని గ్యాలరీలు, వైకుంఠం క్యూ కాంప్లెక్సు- 1, 2, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లు, మినీ అన్నప్రసాదం కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ, పాలు పంపిణీ చేస్తారని వెల్లడించారు.
ఆలస్యం చేస్తే అంతే….
శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా టీటీడీ టైమ్ స్లాట్ టిక్కెట్లు, టోకెన్లను జారీ చేస్తోందని తెలిపారు. ప్రతిరోజూ దాదాపు 3వేల మంది భక్తులు స్లాట్ సమయాన్ని అనుసరించడం లేదని, నిర్దేశించిన సమయం కంటే చాలా ఆలస్యంగా వస్తున్నారని తెలిపారు. నిర్ణీత సమయానికి రాని భక్తులను టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి అనుమతిస్తారని ఈవో ప్రకటించారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లను శుక్రవారం విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజు వెయ్యి టికెట్లను జారీ చేస్తుండగా 750 టికెట్లు ఆన్లైన్లో, మరో 250 టికెట్లు ఆఫ్లైన్లో జారీ చేస్తామని తెలిపారు.
అదనంగా లడ్డూ కౌంటర్లు
ఇప్పుడు తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు ప్రసాదం కేంద్రాలను పెంచాలని దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది .ప్రస్తుతం ఉన్న లడ్డు విక్రయ కేంద్రాలు పెరుగుతున్న భక్తుల సంఖ్యలతో సరిపోడం లేదు ప్రస్తుతం 50 లడ్డు కేంద్రాలు నిరంతరం ప్రసాదాలు అందిస్తున్నాయి.అయినా ఇవి సరిపోవడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.దీనిని పరిగణలోకి తీసుకొని మరిన్ని లడ్డు కేంద్రాలు పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.ప్రస్తుతం ఉన్న కేంద్రాలకు మరో ముప్పై లడ్డు కేంద్రాలను అదనంగా అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు